ఎన్నికల ర్యాలీలకు పరిస్థితులు అనుకూలంగా లేవు: ఈసీకి చెప్పిన వీకే పాల్
ABN , First Publish Date - 2022-01-06T23:56:34+05:30 IST
ఐదు రాష్ట్రాలకు త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో దేశంలో రాజకీయ వేడి రగులుకుంది. ఇప్పటికే..
న్యూఢిల్లీ: ఐదు రాష్ట్రాలకు త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో దేశంలో రాజకీయ వేడి రగులుకుంది. ఇప్పటికే సభలు, సమావేశాలు, ర్యాలీలు జరుగుతుండగా కొవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వీటికి కొంత అడ్డుకట్ట పడింది. ఈ క్రమంలో నీతి ఆయోగ్ సభ్యుడు, కొవిడ్ టాస్క్ఫోర్స్ చీఫ్ వీకే పాల్ ఎన్నికల కమిషన్కు కీలక సూచన చేశారు.
దేశంలో పెద్ద ఎత్తున ర్యాలీలు, రోడ్డు షోలు నిర్వహించే పరిస్థితి లేదని పేర్కొన్నారు. కాబట్టి ఇలాంటి వాటిని అనుమతించవద్దని కోరారు. కాగా, రాజకీయ పార్టీలు తమంత తాముగానే ర్యాలీలు, రోడ్డు షోలను ఆపేస్తాయని ఎన్నికల కమిషన్ భావిస్తోంది.
ఎన్నికలు సమీపిస్తుండడంతో వ్యాక్సినేషన్ జోరు పెంచాలని ఇదివరకే ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవా, పంజాబ్, మణిపూర్ ప్రభుత్వాలను ఈసీ కోరింది. అయితే, ఇప్పుడు ఒమిక్రాన్ వేరియంట్ కారణంగా కేసులు పెరుగుతుండడం ఆందోళన రేకెత్తిస్తోంది. కరోనా నేపథ్యంలో ఈసీ కూడా పకడ్బందీ చర్యలు చేపడుతోంది.
ఉద్యోగులను పెంచడం, పూర్తిగా టీకాలు తీసుకున్న అధికారులను నియమించడం, పోలింగ్ కేంద్రాలను పెంచడం వంటివి చేయాలని నిర్ణయించింది. ఇటీవల ఆరోగ్య కార్యదర్శి రాజేశ్ భూషణ్ను కలిసి కొవిడ్ పరిస్థితులపై చర్చించింది. ఉత్తరప్రదేశ్, పంజాబ్, మణిపూర్లలో తొలి డోసు వేసుకున్న వారి సంఖ్య కూడా చాలా తక్కువగా ఉండగా, ఉత్తరాఖండ్, గోవాలలో దాదాపు 100 శాతం పూర్తయినట్టు ఈసీ గుర్తించింది.