పరదాలు తొలగించండి

ABN , First Publish Date - 2021-05-19T06:22:02+05:30 IST

భవన నిర్మాణాల్లో భాగంగా కార్మికులు వాటి చుట్టూ కడుతున్న పరదాల కారణంగా విద్యుత్‌ సరఫరాకు అంతరాయం కలుగుతోందని సీపీడీసీఎల్‌ ఎస్‌ఈ ఎం.శివప్రసాద్‌రెడ్డి తెలిపారు.

పరదాలు తొలగించండి

   లేకపోతే విద్యుత్‌ చట్టం కింద కేసులు

  భవన నిర్మాణ కార్మికులకు సీపీడీసీఎల్‌ హెచ్చరిక

విజయవాడ, మే 18(ఆంధ్రజ్యోతి): భవన నిర్మాణాల్లో భాగంగా కార్మికులు వాటి చుట్టూ కడుతున్న పరదాల కారణంగా విద్యుత్‌ సరఫరాకు అంతరాయం కలుగుతోందని సీపీడీసీఎల్‌ ఎస్‌ఈ ఎం.శివప్రసాద్‌రెడ్డి తెలిపారు. గాలులు బలంగా వీచినప్పుడు చిరిగిపోయి ఆ పరదాలు విద్యుత్‌ లైన్లపై పడుతున్నాయని పేర్కొన్నారు. దీనివల్ల లైన్లు బ్రేక్‌డౌన్‌ అవుతున్నాయని తెలిపారు. దీనికి సంబంధించి ఆయన మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. పరదాలు కట్టి నెలలు కావడంతో అవి పాడై చిరిగిపోతున్నాయన్నారు. భవన నిర్మాణ కార్మికులు నిత్యం వాటిని పరిశీలిస్తూ చిరిగిపోతే తొలగించాలని సూచించారు. లేనిపక్షంలో వారిపై విద్యుత్‌ చట్టం సెక్షన్‌ 136 కింద కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. దీనికి సంబంధించిన నష్టపరిహారంతోపాటు విద్యుత్‌ అంతరాయానికి సంబంధించిన నష్టపరిహారాన్ని కార్మికుల నుంచి వసూలు చేస్తామని హెచ్చరించారు. ఈ పరదాలు హై టెన్షన్‌ తీగలపై పడడం వల్ల తెగిపోతున్నాయని, హైటెన్షన్‌ తీగలు కాలిపోతున్నాయని వివరించారు.  రెండు, మూడు విద్యుత్‌ ఉపకేంద్రాల్లో బ్రేక్‌డౌన్లు ఏర్పడుతున్నాయన్నారు. కొంతమంది వినియోగదారులు భవనాలపై దుస్తులను ఆరబెట్టినప్పుడు జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల అవి ఎగిరి సమీపాన ఉన్న ట్రాన్స్‌ఫార్మర్లపై పడి ప్రమాదాలు సంభవిస్తున్నాయని పేర్కొన్నారు.  

Updated Date - 2021-05-19T06:22:02+05:30 IST