ఒకే సిలిండర్‌తో ఆరుగురికి ఆక్సిజన్‌ సరఫరా

ABN , First Publish Date - 2020-03-31T07:41:28+05:30 IST

అవసరమే కొత్త ఆవిష్కరణలకు ఊపిరి పోస్తుందనే విషయాన్ని విశాఖపట్నంలోని తూర్పు నౌకాదళం నావల్‌ డాక్‌యార్డు ఉద్యోగులు...

ఒకే సిలిండర్‌తో ఆరుగురికి ఆక్సిజన్‌ సరఫరా

  • విశాఖ డాక్‌యార్డు సిబ్బంది ఆవిష్కరణ

విశాఖపట్నం, మార్చి 30 (ఆంధ్రజ్యోతి): అవసరమే కొత్త ఆవిష్కరణలకు ఊపిరి పోస్తుందనే విషయాన్ని విశాఖపట్నంలోని తూర్పు నౌకాదళం నావల్‌ డాక్‌యార్డు ఉద్యోగులు నిరూపించారు. ప్రస్తుతం కోవిడ్‌-19 కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో.. పరిమితంగా ఉన్న వనరులతో ఎక్కువ మందికి వైద్య చికిత్సలు చేయాల్సిన అవసరం ఏర్పడింది. సాధారణంగా రోగులకు ఆక్సిజన్‌ అవసరమైనప్పుడు ఆ బెడ్‌ దగ్గరలోనో, సమీపంలోనో సిలిండర్‌ పెట్టి పైపుల ద్వారా సరఫరా చేస్తారు. ఒక్కో రోగికి ఒక్కో సిలిండర్‌ అవసరమవుతుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో పెద్ద సంఖ్యలో రోగులు ఆస్పత్రులకు వస్తున్నందున ఒక సిలిండర్‌ను ఎక్కువ మందికి ఎలా ఉపయోగించవచ్చనే అంశంపై డాక్‌యార్డు సిబ్బంది ప్రయోగాలు చేశారు. ఒక సిలిండర్‌తో ఆరుగురికి ఒకేసారి ఆక్సిజన్‌ అందించేందుకు అవసరమైన మొబైల్‌ పరికరం రూపొందించారు.


దానికి ‘మల్టీ-ఫీడ్‌ ఆక్సిజన్‌ మానిఫోల్డ్‌ (ఎంవోఎం)’ అని నామకరణం చేశారు. ఈ విధానంలో ఆక్సిజన్‌ సిలిండర్‌కు 6-వే రేడియల్‌ హెడర్‌ను అమర్చి ఐఎన్‌ఎస్‌ కల్యాణి ఆస్పత్రిలో మార్చి మార్చి ప్రయోగాలు చేసి విజయం సాధించారు. ఈ అమరిక 30 నిమిషాల్లోనే పూర్తవుతుందని నేవీ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం పది ఎంవోఎంలను సిద్ధం చేశామని, అవసరమైతే మరిన్ని తయారుచేస్తామని పేర్కొన్నాయి. తక్కువ సిలిండర్లతో ఎక్కువ మందికి ఆక్సిజన్‌ అందించి క్రిటికల్‌ కేర్‌లో చక్కటి చికిత్స అందేలా చూడడమే ధ్యేయమని ఓ నేవీ అధికారి తెలిపారు.


Updated Date - 2020-03-31T07:41:28+05:30 IST