ఆరుగురు ‘ఎర్ర’ స్మగ్లర్ల అరెస్టు
ABN , First Publish Date - 2022-01-26T07:34:18+05:30 IST
ఆరుగురు ఎర్రచందనం స్మగ్లర్లను అరెస్టు చేసి, తొమ్మిది దుంగలు, ఓ మినీ లారీని స్వాధీనం చేసుకున్నారు.
తొమ్మిది దుంగలు, మినీ లారీ స్వాధీనం
తిరుపతి (కపిలతీర్థం), జనవరి 25: ఆరుగురు ఎర్రచందనం స్మగ్లర్లను అరెస్టు చేసి, తొమ్మిది దుంగలు, ఓ మినీ లారీని స్వాధీనం చేసుకున్నారు. తిరుపతిలోని టాస్క్ఫోర్స్ కార్యాలయంలో డీఎస్పీ మురళీధర్ మంగళవారం మీడియాకు వివరాలను తెలియజేశారు. ఎస్పీ సుందరరావు ఆదేశాల మేరకు ఆర్ఎ్సఐలు కేఎ్సకే లింగాధర్, కె.సురేష్ బాబు బృందం భాకరాపేట సెక్షన్ చిన్న గొట్టిగల్లు మండల పరిధిలో మంగళవారం వేకువ జామున కూంబింగ్ నిర్వహించారు. ఆ సమయంలో ఓ మినీ లారీలో లోడ్ చేయడానికి ఎర్రచందనం దుంగలను స్మగ్లర్లు మోసుకొస్తూ తారసపడ్డారు. వారిని పట్టుకోవడానికి ప్రయత్నించగా, దుంగలను పడేసి పరారయ్యారు. అయినప్పటికీ టాస్క్ఫోర్స్ బృందం ఆరుగురు స్మగ్లర్లను పట్టుకున్నారు. సంఘటనా స్థలం నుంచి మూడు గొడ్డళ్లను, తొమ్మిది ఎర్రచందనం దుంగలను, మినీ లారీని స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.30 లక్షలు ఉంటుందన్నారు. పట్టుబడినవారిని తమిళనాడు రాష్ట్రం తిరువణ్ణామలై జిల్లా జమునామత్తూరుకు చెందిన రమేష్, దొరైస్వామి, కుమారస్వామి, పొన్నుస్వామి, ఆనందన్, మది అలగన్గా గుర్తించారు. స్మగ్లర్లను అరెస్టు చేసిన సిబ్బందికి రివార్డులు అందించడం జరుగుతుందని డీఎస్పీ పేర్కొన్నారు. ఈ సమావేశంలో సీఐలు వెంకటరవి, చంద్రశేఖర్, ఆర్ఐ సురేష్ కుమార్ రెడ్డి, ఎఫ్ఆర్వో ప్రసాద్, ఎస్ఐ మోహన్ నాయక్ పాల్గొన్నారు.