మళ్లీ ఆందోళన తప్పదు: కేంద్రానికి రైతుల హెచ్చరిక

ABN , First Publish Date - 2021-12-09T21:29:56+05:30 IST

సుదీర్ఘ కాలంపాటు సాగిన రైతుల నిరసనలు ముగిశాయి. రైతులు ప్రభుత్వం ముందు ఉంచిన అన్ని డిమాండ్లకు ఆమోదం లభించడంతో ఈ ఉద్యమాన్ని విరమించాలని రైతు సంఘాలు నిర్ణయించాయి..

మళ్లీ ఆందోళన తప్పదు: కేంద్రానికి రైతుల హెచ్చరిక

న్యూఢిల్లీ: వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఏడాది కాలంగా కొనసాగిన ఆందోళనను విరమించుకుంటున్నట్లు రైతు సంఘాలు ప్రకటించాయి. అయితే మళ్లీ ఆందోళన తప్పదని రైతు సంఘాల వేదిక అయిన సంయుక్త కిసాన్ మోర్చా కేంద్రాన్ని హెచ్చరించింది. రైతులు పెట్టిన డిమాండ్లకు ప్రభుత్వం అంగీకరించినందు వల్లే ఆందోళనను ఉపసంహరించుకున్నామని, ఒకవేళ కేంద్రం కనుక తమ డిమాండ్లను ఆచరణలో పెట్టకపోతే ఆందోళన మళ్లీ చేపడతామని స్పష్టం చేశారు.


సుదీర్ఘ కాలంపాటు సాగిన రైతుల నిరసనలు ముగిశాయి. రైతులు ప్రభుత్వం ముందు ఉంచిన అన్ని డిమాండ్లకు ఆమోదం లభించడంతో ఈ ఉద్యమాన్ని విరమించాలని రైతు సంఘాలు నిర్ణయించాయి. తాము డిసెంబరు 11 శనివారం తమ నిరసన కార్యక్రమాలను విరమించి, తిరిగి తమ స్వస్థలాలకు చేరుకుంటామని రైతు సంఘాలు గురువారం ప్రకటించాయి. గురువారం సాయంత్రం 5.30 గంటలకు విజయోత్సవ ప్రార్థనను నిర్వహించనున్నట్లు తెలిపాయి. శనివారం ఉదయం 9 గంటలకు సింఘు, టిక్రి నిరసన స్థలాల వద్ద విజయోత్సవ కవాతును కూడా నిర్వహించనున్నట్లు తెలిపాయి. ఈ నెల 13న పంజాబ్‌లోని అమృత్‌సర్‌ స్వర్ణ దేవాలయంలో ప్రత్యేక ప్రార్థనలను నిర్వహించాలని పంజాబ్ రైతులు నిర్ణయించారు.

Updated Date - 2021-12-09T21:29:56+05:30 IST