స్మార్ట్ సిటీ లే అవుట్ స్థలాల పరిశీలన
ABN , First Publish Date - 2021-04-11T06:13:54+05:30 IST
కందుకూరు పట్టణంలో మధ్య తరగతి, ఎగువ మధ్య తరగతి వర్గాల కోసం ప్రభుత్వం మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న స్మార్ట్ సిటీ లే - అవుట్ల కోసం అనువైన స్థలాలను శనివారం సాయంత్రం పరిశీలించారు.
కందుకూరు, ఏప్రిల్ 10: కందుకూరు పట్టణంలో మధ్య తరగతి, ఎగువ మధ్య తరగతి వర్గాల కోసం ప్రభుత్వం మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న స్మార్ట్ సిటీ లే - అవుట్ల కోసం అనువైన స్థలాలను శనివారం సాయంత్రం పరిశీలించారు. మున్సిపల్ డీటీసీపీ రాముడుతో కలిసి ఎమ్మెల్యే మానుగుంట మహీధరరెడ్డి విప్పగుంట రోడ్డు, కనిగిరి రోడ్డులోని జి ఫ్లస్ 3 గృహాల సముదాయాన్ని సమీపంలోని స్థలాలను పరిశీలించారు. జి ఫ్లస్ 3 గృహాలను, స్విమ్మింగ్ పూల్ను కూడా పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కందుకూరు మున్సిపాలిటీ మాస్టర్ ఫ్లాన్ తుది రూపుకి వస్తున్నదని ఆ మాస్టర్ఫ్లాన్కు అనుగుణంగా ప్రజలకు ఎంతో సౌకర్యవంతంగా పూర్తిస్థాయి మౌలికసదుపాయాలతో ఉండేలా ఈ స్మార్ట్ సిటీ లే అవుట్లను తీర్చిదిద్దుతున్నామన్నారు. వారి వెంట మున్సిపల్ కమిషనర్ ఎస్.మనోహర్, పట్టణ ఎస్సై కెకె తిరుపతిరావు, అధికారులు ఉన్నారు.
ఫుడ్ కోర్టు ప్రారంభం
పట్టణంలోని సమ్మర్ స్టోరేజి ట్యాంకు వద్ద మున్సిపాలిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈత కొలను వద్ద ఫుడ్ కోర్ట్ను ఎమ్మెల్యే మానుగుంట మహీధర్రెడ్డి శనివారం ఉదయం ప్రారంభించారు. మెప్మా ఆధ్వర్యంలో ఈ ఫుడ్ కోర్ట్ను ఏర్పాటు చేశారు. ఈతకొలనుకి వచ్చేవారి సంఖ్య గణనీయంగా పెరగటమేగాక అనేక మంది పిల్లలను కూడా ఈత నేర్పించేందుకు తీసుకొస్తున్నారని ఈ స్థితిలో వారికి అవసరమైన తినుబండారాలు, పానీయాలు అందుబాటులో ఉంచడం కోసం ఫుడ్ కోర్ట్ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఎస్. మనోహర్, డీఈ విజయలక్ష్మి పాల్గొన్నారు.