ఇక ఇంటర్‌కూ ‘స్మార్ట్‌’ బోధన. మెమోలపై దోస్త్ వివరాలు

ABN , First Publish Date - 2020-06-04T17:48:53+05:30 IST

లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఇంటర్‌ విద్యార్థులకు కూడా ఆన్‌లైన్‌ విధానంలోనే పాఠాలను బోధించాలని కేంద్రం నిర్ణయించింది. ప్రత్యామ్నాయ పాఠ్య ప్రణాళికను కేంద్ర మానవ వనరుల శాఖ విడుదల చేసింది. స్మార్ట్‌ఫోన్‌ ఉన్న విద్యార్థులకు సోషల్‌ మీడియా ద్వారా బోధించాలని, సాధారణ ఫోన్లు ఉన్న వారిని ఫోన్‌కాల్‌, ఎస్‌ఎంఎస్‌ ద్వారా సంప్రదించాలని ప్రిన్సిపాల్స్‌, ఉపాధ్యాయులకు సూచించింది.

ఇక ఇంటర్‌కూ ‘స్మార్ట్‌’ బోధన. మెమోలపై దోస్త్ వివరాలు

న్యూఢిల్లీ : లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఇంటర్‌ విద్యార్థులకు కూడా ఆన్‌లైన్‌ విధానంలోనే పాఠాలను బోధించాలని కేంద్రం నిర్ణయించింది. ప్రత్యామ్నాయ పాఠ్య ప్రణాళికను కేంద్ర మానవ వనరుల శాఖ విడుదల చేసింది. స్మార్ట్‌ఫోన్‌ ఉన్న విద్యార్థులకు సోషల్‌ మీడియా ద్వారా బోధించాలని, సాధారణ ఫోన్లు ఉన్న వారిని ఫోన్‌కాల్‌, ఎస్‌ఎంఎస్‌ ద్వారా సంప్రదించాలని ప్రిన్సిపాల్స్‌, ఉపాధ్యాయులకు సూచించింది.


ఇంటర్‌ ఫలితాలరోజే ‘దోస్త్‌’ నోటిఫికేషన్‌... సెప్టెంబరు తొలి వారంలో డిగ్రీ తరగతులను ప్రారంభించేందుకు ఉన్నత విద్యామండలి ప్రణాళిక సిద్ధం చేస్తోంది. రాష్ట్రంలోని ‘డిగ్రీ’ కాలేజీల్లో ప్రవేశాల కోసం ఆన్‌లైన్‌ సర్వీసెస్‌ తెలంగాణ (దోస్త్‌) నోటిఫికేషన్‌ విడుదల చేయడానికి సన్నాహాలు ప్రారంభించింది. ఈ సారి ప్రవేశాల ప్రక్రియలో జాప్యం నేపథ్యంలో ఇంటర్‌ ద్వితీయ సంవత్సర ఫలితాలు ప్రకటించినరోజే నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నారు. ఫలితాలు ఈ నెల 15 న విడుదలయ్యే  అవకాశముంది. ఆరు విశ్వవిద్యాలయాల పరిధిలోని వెయ్యికి పైగా డిగ్రీ కళాశాలల్లోని 200 కోర్సుల్లో ప్రవేశానికి ఈ ప్రక్రియ ప్రారంభం కానుంది. గత ఏడాది దోస్త్‌ నోటిఫికేషన్‌ మే 22 న విడుదల కాగా, మూడు విడతల్లో ప్రవేశాలు నిర్వహించి జూలై ఒకటి నుంచి తరగతులు ప్రారంభించారు.


ఈ మొత్తం ప్రక్రియ 38 రోజుల్లో పూర్తయింది. ఈ సారి డిగ్రీ తరగతులు సెప్టెంబరు 1 నుంచి నిర్వహించాలన్న యూజీసీ మార్గదర్శకాల నేపథ్యంలో.. ఆగస్టు నెలాఖరులోపు ప్రవేశాల ప్రక్రియ పూర్తిచేయాలని భావిస్తున్నారు.  ఇక ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం జాగ్రఫీ, మాడ్రన్‌ లాంగ్వేజ్‌ పరీక్ష బుధవారం ప్రశాంతంగా ముగిసింది. మొత్తం 861 మంది విద్యార్థులకుగాను 834 మంది (97శాతం) హాజరయ్యారు.


ఇక మెమోలపై ‘దోస్త్‌’ వివరాల నమోదుకు సంబంధించిన నోటిఫికేషన్‌ విడుదలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం ఉత్తీర్ణులయ్యే విద్యార్థులందరికీ దోస్త్‌ ద్వారా ప్రవేశాల ప్రక్రియను తెలిపేందుకు ఇంటర్‌ మెమో వెనక వివరాలు ప్రచురిస్తున్నాం. అలాగే ఉత్తీర్ణులైన ఇంటర్‌ విద్యార్థుల ఫోన్లకు ఎస్‌ఎంఎస్‌ రూపంలోనూ సూచనలు అందించనున్నట్లు  ‘దోస్త్‌’ కన్వీనర్‌ ప్రొఫెసర్‌ ఆర్‌.లింబాద్రి వెల్లడించారు. 

Updated Date - 2020-06-04T17:48:53+05:30 IST