ఆ గ్రూప్ రక్తం ఉన్న వారికి కరోనా ముప్పు తక్కువే!
ABN , First Publish Date - 2021-04-26T22:00:16+05:30 IST
ప్రస్తుతం భారతదేశాన్ని రెండో దశ కరోనా ఉద్ధృతి వణికిస్తోంది
ప్రస్తుతం భారతదేశాన్ని రెండో దశ కరోనా ఉద్ధృతి వణికిస్తోంది. రోజుకు కొన్ని లక్షల మంది కరోనా బారిన పడుతున్నారు. అయితే కరోనా ముప్పు అందరికీ ఒకేలా ఉండదని, బ్లడ్ గ్రూప్లను బట్టి, తీసుకునే ఆహారాన్ని బట్టి కరోనాను ఎదుర్కొనే సామర్థ్యం కూడా మారుతుంటుందని తాజా సర్వేలో తేలింది. `ఓ` గ్రూప్ రక్తాన్ని కలిగి ఉన్నవారు కరోనా బారిన పడే అవకాశాలు తక్కువని ఆ సర్వే స్పష్టం చేసింది. సార్స్-కోవ్-2 వైరస్ను ఢీకొట్టే యాంటీ బాడీస్ ఎవరెవరిలో ఎక్కువ ఉన్నాయనే విషయంపై కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్(సీఎస్ఐఆర్) పాన్-ఇండియా సెరో సర్వే నిర్వహించింది.
సర్వేలో భాగంగా 140 మంది డాక్టర్లు, సైంటిస్టులు, సీఎస్ఐఆర్ ల్యాబ్ల్లో పనిచేసే 10,427 మంది ఉద్యోగుల, వారి కుటుంబ సభ్యుల శరీరాల్లోని యాంటీ బాడీస్ పని తీరును పరిశీలించింది. `ఓ` గ్రూప్ రక్తం కలిగి ఉన్న వ్యక్తులకు కరోనా ముప్పు తక్కువని ఈ సర్వేలో తేలింది. అలాగే `బీ`, `ఏబీ` గ్రూప్ రక్తం ఉన్నవారిలో సెరో పాజిటివిటీ అధికంగా ఉంటుందని, వారికి కరోనా రిస్క్ ఎక్కువని పరిశోధకులు తేల్చారు. ఇక, పీచు పదార్థం సమృద్ధిగా ఉండే శాకాహారం తినేవారిలో కరోనాను ఎదుర్కొనే యాంటీ బాడీస్ అధికంగా ఉన్నట్టు గుర్తించారు. అంతే కాకుండా పొగ తాగేవారిలో కూడా సెరో పాజిటివిటీ తక్కువగా ఉందని, పొగ తాగడం కారణంగా వారి గొంతులో ఏర్పడే జిగురు వంటి పదార్థం వైరస్ వ్యాప్తిని అడ్డుకుంటోందని బయటపెట్టారు.