పొగ తాగేవారికి షాకింగ్ న్యూస్.. 14 రెట్లు ఎక్కువ ‘కరోనా’ ముప్పు!
ABN , First Publish Date - 2020-03-27T13:24:58+05:30 IST
పొగతాగే వారిపై కరోనా మరింత పగ పడుతుందట. వారికి వైరస్ వ్యాపించేందుకు 14 రెట్లు ఎక్కువ
- ప(పొ)గ పట్టే కరోనా...
- పొగ తాగేవారికి 14 రెట్లు ఎక్కువ ముప్పు
హైదరాబాద్ : పొగతాగే వారిపై కరోనా మరింత పగ పడుతుందట. వారికి వైరస్ వ్యాపించేందుకు 14 రెట్లు ఎక్కువ అవకాశముందని చైనా శాస్త్రవేత్తలు తేల్చిచెప్పారు. చైనాలో కరోనా సోకిన వేలాది మందిపై పరిశోధనలు చేసి.. అక్కడ వెలువడే హెల్త్ జనరల్లో ఈ విషయాన్ని ప్రచురించారు. కరోనా సోకితే ఛాతీ, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ వస్తుంది. శ్వాస తీసుకోవడంలో సమస్య ఏర్పడుతుంది. మధుమేహం, శ్వాసకోశ సమస్యలు ఉన్నవారు ఎక్కువ మంది దీనికి బలి అవుతున్నారు. పొగ తాగేవారిలో వ్యాధి నిరోధక శక్తి తగ్గడంతో కరోనా సులభంగా వ్యాపిస్తుందని, ఇప్పటికైనా పొగతాగే అలవాటును మానుకోండని వైద్యులు సూచిస్తున్నారు. శుభ్రత కోసం ఊపిరితిత్తులు మ్యూకస్ను ఉత్పత్తి చేస్తాయని, పొగతాగేవారిలో ఈ మ్యూకస్ మందంగా ఉండటంతో ఊపిరితిత్తులు వ్యర్థాలను బయటికి పంపేందుకు చాలా ప్రయాసపడతాయని ఇండియన్ డెంటల్ అసోసియేషన్ దక్కన్ బ్రాంచ్ సెక్రటరీ డాక్టర్ శ్రీకాంత్ అన్నారు.
పొగతాగడం మానేసిన కొద్ది నెలలకే శ్వాసకోశ సమస్యలు తగ్గుముఖం పట్టడంతోపాటు రోగనిరోధక శక్తిపెరుగుతుందని తెలిపారు. పాసివ్ స్మోకర్స్కు కూడా శ్వాసకోశ సమస్యలు వచ్చే అవకాశాలున్నాయని టాటా మెమోరియల్ ట్రస్ట్ క్యాన్సర్ విభాగం డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ పంకజ్ చతుర్వేది సూచించారు. ఒకే సిగరెట్ను పలువురు పంచుకొని తాగడం ద్వారా కరోనా వ్యాపించే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయన్నారు. పొగాకు ఉత్పత్తులైన గుట్కా, జరదాలను తిని రోడ్లపై ఉమ్మడం కారణంగా ఉత్తరాది రాష్ట్రాల్లో కరోనా వ్యాప్తి చెందుతోందని, ప్రజలు ఈ విషయాన్ని గమనించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వలంటరీ హెల్త్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ప్రధాన కార్యదర్శి భావన ముఖోపాధ్యాయ తెలిపారు.