హైదరాబాద్ సిటీలో ఆత్మహత్యల కలకలం

ABN , First Publish Date - 2020-08-11T15:57:06+05:30 IST

కుటుంబ కలహాల నేపథ్యంలో ఎనిమిది నెలల చిన్నారి సహా అపార్ట్‌మెంట్‌పై నుంచి దూకి ఓ తల్లి ఆత్మహత్య చేసుకుంది. మరో మహిళ కూడా అపార్ట్‌మెంట్‌ పై నుంచే దూకి బలవన్మరణానికి పాల్పడింది. ఇంకోచోట ఓ మహిళను దారుణంగా హత్య చేశాడు. ఈ సంఘటనలు నగరంలో కలకలం సృష్టించాయి

హైదరాబాద్ సిటీలో ఆత్మహత్యల కలకలం

పలుచోట్ల ఘటనలు

ఎనిమిది నెలల చిన్నారి సహా తల్లి ఆత్మహత్య

ఎస్‌ఆర్‌ నాయక్‌నగర్‌లో మరో మహిళ

ఇద్దరూ అపార్ట్‌మెంట్ల పై నుంచి దూకి..

మరోచోట మహిళ దారుణ హత్య

బీరు బాటిల్‌తో తలపై కొట్టి, మెడపై కాలు వేసి తొక్కి..  


రామంతాపూర్‌, హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి):  కుటుంబ కలహాల నేపథ్యంలో ఎనిమిది నెలల చిన్నారి సహా అపార్ట్‌మెంట్‌పై నుంచి దూకి ఓ తల్లి ఆత్మహత్య చేసుకుంది.  మరో మహిళ కూడా అపార్ట్‌మెంట్‌ పై నుంచే దూకి బలవన్మరణానికి పాల్పడింది. ఇంకోచోట ఓ మహిళను దారుణంగా హత్య చేశాడు.  ఈ సంఘటనలు నగరంలో కలకలం సృష్టించాయి. 


కుటుంబ కలహాల నేపథ్యంలో ఎనిమిది నెలల పాప సహా, తల్లి అపార్ట్‌మెంట్‌ నాలుగో అంతస్తుపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరూ అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. ఉప్పల్‌ పోలీ్‌సస్టేషన్‌ పరిధి రామంతాపూర్‌లో సోమవారం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. కర్నూలు జిల్లా బనగానపల్లి మండలం టంగుటూరుకు చెందిన మేరి మార్టిన్‌(38)కు 2017లో ప్రభాకర్‌తో వివాహమైంది. వీరు రామంతాపూర్‌ శ్రీనివాసపురం వీధి నెంబర్‌-4లోని భవానీ అపార్ట్‌మెంట్‌లో ఉంటున్నారు. కొన్ని రోజులుగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో సోమవారం ఆమె తన ఎనిమిది నెలల పాప సహా అపార్ట్‌మెంట్‌ నాలుగో అంతస్తులోని టెర్రస్‌ పైనుంచి దూకింది. ఇద్దరూ అక్కడికక్కడే చనిపోయారు. ఇరుగుపొరుగు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు వచ్చి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఎనిమిది నెలల చిన్నారి సహా తల్లి ఆత్మహత్య చేసుకోవడం స్థానికంగా కలకలం సృష్టించింది. వారి మృతదేహాలను చూసి స్థానికులు కంటతడి పెట్టారు. కాగా, భర్త మరో మహిళతో వివాహేతర సంబంధం కారణంగానే మేరి మార్టిన్‌ ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చునని చర్చ జరుగుతోంది.  


మనస్తాపానికి గురై.. 

జీడిమెట్ల, ఎస్‌ఆర్‌నాయక్‌నగర్‌లోని శివరెసిడెన్సీ నాలుగో అంతస్తులో ఉండే చేపూరి సుశీల(50) భర్త చనిపోయాడు. 25 ఏళ్లుగా కుమారుడు సాయికిరణ్‌తో కలిసి ఉంటోంది. సాయికిరణ్‌ అనిత అనే యువతిని 2017లో ప్రేమ వివాహం చేసుకున్నాడు. కొంతకాలం బాగానే ఉన్నా.. ఇటీవల అత్తాకోడళ్ల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. ఈ నేపథ్యంలో కొడుకు భార్యను తీసుకు ని చింతల్‌లో అద్దె ఇంట్లో ఉంటున్నాడు. ఇటీవలే పెద్దలు రాజీ కుదిర్చారు. కాగా, తన కుమారుడిని కోడలి సోదరులు కొట్టడంతో తీవ్ర మనస్తాపానికి గురైన సుశీల ఆదివారం అర్ధరాత్రి అపార్ట్‌మెంట్‌ నాలుగో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది.  జీడిమెట్ల పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.


మహిళ దారుణ హత్య

వివాహేతర సంబంధం పెట్టుకున్న వ్యక్తే ఆమెను దారుణంగా హ్యత చేసిన ఘటన ఉప్పల్‌ పోలీ్‌సస్టేషన్‌ పరిధి చిలుకానగర్‌లో ఆదివారం రాత్రి జరిగింది. ఉప్పల్‌ పోలీసుల కథనం ప్రకారం.. నాచారం బాబానగర్‌లో నివసించే 30 ఏళ్ల మహిళ భర్త చనిపోవడంతో ఎనిమిదేళ్ల కూతురితో కలిసి తల్లిదండ్రుల వద్దే ఉంటోంది. ఆమెకు ఇదే ప్రాంతంలోని కుమ్మరికుంటకు చెందిన అంజయ్యతో కొన్నేళ్లుగా స్నేహం ఉంది. తరచూ ఒంటరిగా కలుసుకునేవారు. అంజయ్య భార్యాపిల్లలు ఆదివారం ఊరికి వెళ్లగా, రాత్రి ఎనిమిది గంటల ప్రాంతంలో మహిళ అంజయ్య ఇంటికి వెళ్లింది. రాత్రి ఇద్దరూ కలిసి బీరు తాగారు. తర్వాత ఆమె డబ్బులు కావాలని అంజయ్యను డిమాండ్‌ చేసింది. దీంతో కోపోద్రిక్తుడైన అంజయ్య మహిళ తలపై బీరుబాటిల్‌తో కొట్టి తీవ్రంగా గాయపరిచాడు. అపస్మారక స్థితిలో ఉన్న ఆమె మెడపై కాలుతో ఊపిరి పోయేంత వరకు తొక్కి చంపినట్లు పోలీసులకు లొంగిపోయిన అంజయ్య వెల్లడించాడు. ఈమేరకు ఉప్పల్‌ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2020-08-11T15:57:06+05:30 IST