ఈ-శ్రమ్‌తో కార్మికులకు సామాజిక భద్రత

ABN , First Publish Date - 2021-12-08T05:02:29+05:30 IST

అసంఘటిత కార్మికుల వివరాలను ఈ-శ్రమ్‌ పోర్టల్‌లో నమోదు చేసి, వారికి సామాజిక భద్రతతో పాటు వివిధ సంక్షేమ పథకాలను అందించనున్నట్లు అదనపు కలెక్టర్‌ శ్రీహర్ష అన్నారు.

ఈ-శ్రమ్‌తో కార్మికులకు సామాజిక భద్రత
ఈ-శ్రమ్‌ పోస్టర్‌ను ఆవిష్కరిస్తున్న అదనపు కలెక్టర్‌ శ్రీహర్ష, అధికారులు

- అదనపు కలెక్టర్‌ శ్రీహర్ష

గద్వాల క్రైం, డిసెంబరు 7 : అసంఘటిత కార్మికుల వివరాలను ఈ-శ్రమ్‌ పోర్టల్‌లో నమోదు చేసి, వారికి సామాజిక భద్రతతో పాటు వివిధ సంక్షేమ పథకాలను అందించనున్నట్లు అదనపు కలెక్టర్‌ శ్రీహర్ష అన్నారు. కలెక్టరేట్‌ సమావేశపు హాలులో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. భారత ప్రభుత్వం సామాజిక భద్రత పథకం కింద అసంఘటిత కార్మికుల కోసం ఈ-శ్రమ్‌ పోర్టల్‌ను ప్రవేశపెట్టిందని తెలిపారు. ఈఎస్‌ఐ సౌకర్యం లేని అసంఘటిత రంగ కార్మికులు ప్రావిడెంట్‌ ఫండ్‌ విభాగంలో ఎలాంటి రుసుము లేకుండా కామన్‌ సర్వీస్‌ సెంటర్‌లో నమోదు చేసుకోవచ్చని తెలిపారు. ఉపాధి హామీ పనులు చేసే కూలీలు, మత్స్యకారులు, వీధి వ్యాపారులు తదితరులందరూ అసంఘటిత  కార్మికుల జాబితాలోకి వస్తారన్నారు. వివరాలు నమోదు చేసుకున్న తర్వాత, కార్డు తీసుకున్న కార్మికులు ప్రమాదవశాత్తు మరణిస్తే వారి కుటుంబానికి రూ.2 లక్షల ఆర్థిక సహాయం అందిస్తారని తెలిపారు. పాక్షికంగా అంగవైకల్యానికి గురయితే లక్ష రూపాయల ఆర్థిక సాయం అందుతుందని చెప్పారు. ప్రతీ మండలంలో కార్మికుల వివరాలను సేకరించి పోర్టల్‌లో నమోదు చేయించాలని అధికారులను ఆదేశించారు. వడ్డేపల్లి, అయిజ, గద్వాల మునిసిపాలిటీలలో ఒక డేటా ఎంట్రీ ఆపరేటర్‌ను నియమించి కార్మికుల వివరాలను ఈ-శ్రమ్‌లో నమోదు చేయించాలని మునిసిపల్‌ కమిషనర్లను ఆదేశించారు. అనంతరం ఈ-శ్రమ్‌ పోర్టల్‌ను విడుదల చేసారు. సమావేశంలో సహాయ కార్మికశాఖ అధికారి మహేష్‌, డీఆర్‌డీవో ఉమాదేవి, జడ్పీ సీఈవో విజయనాయక్‌, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2021-12-08T05:02:29+05:30 IST