రసాబాసగా గిరిజన సొసైటీ ఎన్నికలు
ABN , First Publish Date - 2021-01-26T05:43:30+05:30 IST
మణుగూరు మండలంలోని తిర్లాపురం గ్రామానికి చెందిన ఇసుక క్వారీ ట్రైబల్ లేబర్ సొసైటీ ఎన్నికలు సోమవారం రసాభాసగా మారాయి.
రెండు వర్గాలుగా సభ్యులు
డబ్బులిచ్చి సభ్యులను మభ్యపెడుతున్నారని ఆరోపణ
మణుగూరుటౌన్, జనవరి 25 : మణుగూరు మండలంలోని తిర్లాపురం గ్రామానికి చెందిన ఇసుక క్వారీ ట్రైబల్ లేబర్ సొసైటీ ఎన్నికలు సోమవారం రసాభాసగా మారాయి. 193 మంది సభ్యులున్న సొసైటీ రెండు వర్గాలు విడిపోయింది. మూడు సంవత్సరాలుగా చైౖర్మన్గా కొనసాగుతున్న పాయం చిట్టమ్మ వర్గంలో సభ్యులను మార్చాలని డిమాండ్ చేస్తూ మరో వర్గం ఎన్నికలకు పోయింది. అయి తే ఈ ఎన్నికల్లో సభ్యులకు డబ్బులిచ్చి గెలిచేందుకు పెద్దఎత్తున చిట్టమ్మ వర్గం సభ్యులు డబ్బులు పంపిణీ చేశారని ఆరోపిస్తూ పోలింగ్ బూత్ వద్ద ప్రతిపక్ష వర్గం ఘర్షణకు దిగారు. డబ్బులు పంపిణీ చేసి గెలవాలనుకోవడమేంటని గోడవచేస్తూ పోలింగ్ బూత్లోకి వెళ్లి ఎన్నికల సామగ్రిని లాక్కొని ఎన్నికలను అడ్డుకున్నారు. వివాదం ముదరడంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి గోడవను సద్దుమణిచారు. ఎన్నికలు సజావుగా జరిగేందుకు సహకరించాలని, లేని పక్షంలో క్రిమినల్ కేసులు పెడతామని హెచ్చరించడంతో వివాదం సద్దుమణిగింది. దీంతో ఎన్నికల అధికారి, జిల్లా కో ఆపరేటీవ్ కార్యాలయ అసిస్టెంట్ రిజిసా్ట్రర్ జి శ్రీనివాస్కుమార్ ఎన్నికలను నిర్వహించారు. గోడవ కారణంగా ఓటింగ్ ఆలస్యమవడంతో రాత్రి గడిచే వరకు ఓట్ల లెక్కింపు కొనసాగుతూనే ఉంది. ఎట్టకేలకు నిర్వహించిన సొసైటీ ఎన్నికల్లో తిరిగి పాయం చిట్టమ్మ వర్గం విజయం సాధించింది.