పాత్రికేయుల వినతిని 2 వారాల్లోగా పరిష్కరించండి
ABN , First Publish Date - 2020-10-22T09:47:51+05:30 IST
పాత్రికేయుల వినతిని 2 వారాల్లోగా పరిష్కరించండి
గుర్తింపు కార్డుల పునరుద్ధరణపై హైకోర్టు
అమరావతి, అక్టోబరు 21(ఆంధ్రజ్యోతి): జర్నలిస్టు గుర్తింపు (అక్రిడిటేషన్) కార్డులను పునరుద్ధరించాలన్న వినతిని రెండు వారాల్లోగా పరిశీలించి, పరిష్కరించాలని హైకోర్టు సమాచార శాఖను ఆదేశించింది. దీనిపై కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను వచ్చే నెల 22వ తేదీకి వాయిదా వేసింది. ఈమేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వం పాత్రికేయులకు ఇచ్చే గుర్తింపు కార్డుల గడువు తీరిపోయినా కొత్తవి మంజూరు చేయలేదని, దానిపై వినతిపత్రం ఇచ్చినా అధికారులు చర్యలు తీసుకోలేదంటూ సంపాదకుడు బోళ్ల సతీశ్బాబు హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్పై బుధవారం విచారణ జరిగింది. పిటిషనర్ తరఫు న్యాయవాది ఎస్.ప్రణతి వాదనలు వినిపించారు. గత సెప్టెంబరు 30వ తేదీతో గుర్తింపు కార్డుల గడువు తీరిపోయినా, వాటిని రెన్యువల్ చేయలేదని, కొత్తవీ ఇవ్వడం లేదని, ఈ కారణంగా పాత్రికేయుల వార్తాసేకరణలో ఇబ్బంది తలెత్తుతోందని తెలిపారు.