సోమశిల ఉత్తర కాలువ విస్తరణకు ఓకే

ABN , First Publish Date - 2020-12-03T07:02:03+05:30 IST

సోమశిల ఉత్తర కాలువ విస్తరణ పనులకు రూ.632 కోట్లు మంజూరు చేస్తూ రాష్ట్రప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీచేసింది.

సోమశిల ఉత్తర కాలువ విస్తరణకు ఓకే
రాళ్లపాడు రిజర్వాయర్‌

పనుల కోసం రూ.632 కోట్లు మంజూరు

జీవో విడుదల  చేసిన ప్రభుత్వం

రాళ్లపాడు రిజర్వాయర్‌కు ఎంతో ప్రయోజనం

కందుకూరు, డిసెంబరు 2 : సోమశిల ఉత్తర కాలువ విస్తరణ పనులకు రూ.632 కోట్లు మంజూరు చేస్తూ రాష్ట్రప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. రాళ్లపాడు రిజర్వాయర్‌కు సోమశిల జలాలను పూర్తిస్థాయిలో తరలించేందుకు ఈ విస్తరణ పనులు ఎంతో ఉపయోగం కానున్నాయి. సోమశిల ఉత్తర కాలువ ప్రారంభం నుంచి 700 క్యూసెక్కుల సామర్థ్యం ఉంది. అది రాళ్లపాడు వద్దకు వచ్చే సరికి 150క్యూసెక్కులకే పరిమితమైంది. ప్రస్తుతం దీన్ని ప్రారంభం నుంచి 1,500 క్యూసెక్కులకు పెంచడంతోపాటు, రాళ్లపాడుకు సోమశిల జలాలు వచ్చే కాలువలు కూడా ఉప్పుటేరు వరకు 300 క్యూసెక్కుల సామర్థ్యానికి పెంచుతారు. ఇప్పటి వరకూ తగినంత సామర్థ్యం సామర్థ్యం లేని కారణంగా రాళ్లపాడుకు సోమశిల నుంచి అరవై, డెబ్భై క్యూసెక్కులు మాత్రమే వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఉత్తర కాలువ విస్తరణ చేపట్టాల్సిన ఆవశ్యకతను ఎమ్మెల్యే మహీధర్‌రెడ్డి పలుమార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. దీంతో కాలువ సామర్థ్యాన్ని ప్రారంభం నుంచి ఉప్పుటేరు వరకు రెట్టింపు చేయడంతోపాటు పూర్తిస్థాయిలో లైనింగ్‌ కూడా చేసేందుకు నిర్ణయించి ప్రభుత్వ నిధులు కేటాయించింది. ప్రస్తుతం సోమశిల నుంచి రాళ్లపాడు రిజర్వాయర్‌కు 1.5 టీఎంసీల నికరజలాలు కేటాయించి ఉన్నప్పటికీ 0.5 టీఎంసీ కూడా నీరు తెచ్చుకోలేని పరిస్థితి ఉంది. ఈ కాలువ విస్తరణ పనులు పూర్తయితే 1.5 టీఎంసీలు సునాయాసంగా పొందటమే కాక, అదనపు జలాలు కూడా తెచ్చుకునేందుకు అవకాశం ఏర్పడుతుంది. ఉత్తర కాలువ విస్తరణ పనులకు నిధులు సాధించడంలో కృషిచేసిన ఎమ్మెల్యే మహీధర్‌రెడ్డికి రాళ్లపాడు పరిరక్షణ సమితి అధ్యక్షుడు కాకుమాని మాధవరావు,  రైతుసంఘాల నాయకులు బుధవారం వేర్వేరు ప్రకటనల్లో కృతజ్ఞతలు తెలిపారు.


Updated Date - 2020-12-03T07:02:03+05:30 IST