వాళ్లది రిబ్బన్ కటింగ్: మోదీ సెటైర్

ABN , First Publish Date - 2021-12-12T02:09:35+05:30 IST

''కొందరు రిబ్బన్లు కత్తిరించడమే తమ క్రెడిట్ అనుకుంటారు. బీజేపీ ప్రభుత్వం మాత్రం తలపెట్టిన పనిని సకాలంలో పూర్తి చేస్తుంది'' అని ప్రధాని..

వాళ్లది రిబ్బన్ కటింగ్: మోదీ సెటైర్

బలరాంపూర్: ''కొందరు రిబ్బన్లు కత్తిరించడమే తమ క్రెడిట్ అనుకుంటారు. బీజేపీ ప్రభుత్వం మాత్రం తలపెట్టిన పనిని సకాలంలో పూర్తి చేస్తుంది'' అని ప్రధాని నరేంద్ర మోదీ పరోక్షంగా అఖిలేష్ యాదవ్ సారథ్యంలోని సమాజ్‌వాదీ పార్టీని ఉద్దేశించి అన్నారు. దశాబ్దాలుగా నిర్మాణంలో జాప్యం జరుగుతూ వచ్చిన సరయు కెనాల్ ప్రాజెక్టును ఉత్తరప్రదేశ్‌లోని బలరాంపూర్‌లో ప్రధాని శనివారం ప్రారంభించారు. బీజేపీ ప్రారంభించిన ప్రాజెక్టులన్నీ తమవేనంటూ సమాజ్‌వాదీ చెప్పుకోవడాన్ని మోదీ పరోక్షంగా ఈ సందర్భంగా  ప్రస్తావించారు.


''కొందరు రిబ్బన్లు కత్తిరించడమే లక్ష్యంగా పెట్టుకుంటారు. చిన్నప్పటి అలవాటే అందకు కారణం కావచ్చు. మా లక్ష్యం మాత్రం అది కాదు. సకాలంలో ప్రాజెక్టులు పూర్తి చేయడమే మా లక్ష్యం. గత ప్రభుత్వాలు ఎలా పనిచేశాయే నేను చూశాను. ఏళ్ల తరబడి దేశ వనరులు, డబ్బు, కాలం దుర్వినియోగమయ్యాయి. వాళ్ల ఆలోచన ఒకటే. ప్రభుత్వ సొమ్ము కాబట్టి తాము ఎందుకు బాధపడాలి అనుకుంటారు. దేశాభివృద్ధికి ఈ ఆలోచనే ప్రధాన అవరోధం. సరయు కెనాల్ ప్రాజెక్ట్ జాప్యానికి కూడా కారణం ఇదే. 50 ఏళ్ల క్రితం ఈ ప్రాజెక్టు పని మొదలైంది. ఇప్పుడు 50 ఏళ్ల తర్వాత ఈ ప్రాజెక్టు పూర్తయింది. ప్రాజెక్టు ప్రారంభించినప్పుడు అంచనా వ్యయం రూ.100 కోట్లు. ఇవాళ రూ.10,000 కోట్లు అయింది. ఇదంతా ఎవరి సొమ్ము? మీది కాదా? మీరు కష్టపడి సంపాదించిన సొమ్ము. చేపట్టిన పని పూర్తి చేయకుండా మిమ్మల్ని తప్పుదారి పట్టించిన వాళ్లదే అసలైన తప్పు. వాళ్లను మీరు శిక్షిస్తారా?'' అని సభికులను ఉద్దేశించి మోదీ ప్రశ్నించారు. యూపీ అసెంబ్లీ ఎన్నికలు సమీస్తున్న నేపథ్యంలో మోదీ ప్రసంగం పరోక్షంగా సమాజ్‌వాదీ పార్టీని టార్గెట్‌గా చేసుకుని సాగడం బీజేపీ నేతలు, ఆ పార్టీ కార్యకర్తల్లో జోష్ నింపింది.

Updated Date - 2021-12-12T02:09:35+05:30 IST