విలేకరినంటూ ఫోన్ చేసి బెదిరించిన వ్యక్తిపై ఫిర్యాదు
ABN , First Publish Date - 2021-03-30T17:42:06+05:30 IST
ఆంధ్రజ్యోతి పత్రికకు యాడ్ ఇవ్వాలంటూ ఓ భవన నిర్మాణ యజమానిని
- తన పత్రికతోపాటు ఆంధ్రజ్యోతికి యాడ్ ఇవ్వాలని డిమాండ్
- పోలీసులకు ఫిర్యాదు చేసిన ఆంధ్రజ్యోతి ప్రతినిధి
హైదరాబాద్/బంజారాహిల్స్ : ఆంధ్రజ్యోతి పత్రికకు యాడ్ ఇవ్వాలంటూ ఓ భవన నిర్మాణ యజమానిని బెదిరించిన వ్యక్తిపై పత్రిక స్థానిక విలేకరి బంజారాహిల్స్ పీఎస్లో ఫిర్యాదు చేశారు. ఆంధ్రజ్యోతి స్థానిక విలేకరి బి. సతీష్కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. వివరాలు...బంజారాహిల్స్ రోడ్ నెం. 10లో నివసించే కిరణ్ అనే వ్యక్తి తాను ఓ పత్రిక విలేకరినంటూ భవన నిర్మాణ యజమానికి కాల్ చేశాడు. తన పత్రికకు యాడ్ ఇవ్వాలని చెప్పడంతో పాటు, ఆంధ్రజ్యోతి స్థానిక విలేకరి పేరు ప్రస్తావిస్తూ... ఆంధ్రజ్యోతికి కూడా యాడ్ ఇవ్వాలని డిమాండ్ చేశాడు. వారి సంభాషణ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. తన సంస్థ పేరుతో పాటు తన పేరును దుర్విని యోగ పరుస్తున్న వ్యక్తిపై చర్యలు తీసుకోవాలంటూ ఆంధ్రజ్యోతి విలేకరి సోమవారం బంజారాహిల్స్ పోలీసులను ఆశ్రయించారు. తన పరువుకు భంగం వాటిల్లిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫిర్యాదును స్వీకరించామని, దర్యాప్తు చేస్తున్నామని బంజారాహిల్స్ పోలీసులు వెల్లడించారు.