ఏపీలో అధికారంలోకి రావడమే మా లక్ష్యం: సోము వీర్రాజు
ABN , First Publish Date - 2020-08-11T17:30:19+05:30 IST
2024లో ఏపీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా ముందుకు సాగుతామని..
విజయవాడ: 2024లో ఏపీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా ముందుకు సాగుతామని, ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి రావడమే తమ లక్ష్యమని బీజేపీ రాష్ట్ర అధక్షుడు సోము వీర్రాజు వ్యాఖ్యానించారు. మంగళవారం ఉదయం అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆయన మాట్లాడుతూ పేదలకు ప్రభుత్వ ఫలాలు అందాలన్నదే బీజేపీ లక్ష్యమన్నారు. కేంద్రం అన్ని గ్రామాలకు ఎల్ఈడీ బల్బులు ఇచ్చిందన్నారు. జన్ధన్ ఖాతాల ద్వారా పేదల జీవితాల్లో వెలుగులు నింపామని సోము వీర్రాజు అన్నారు.
పోలవరం ప్రాజెక్టు ఈ ప్రాంత ప్రజల జీవనాడి అని.. కేంద్ర ప్రభుత్వం ఆ ప్రాజెక్టును పూర్తి చేస్తుందని సోము వీర్రాజు స్పష్టం చేశారు. బీజేపీది ఎప్పుడూ ఒకటే మాట.. ఒకటే సిద్ధాంతమని అన్నారు. చిన్న రాష్ట్రాలతోనే అభివృద్ధి సాధ్యమని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇతర పార్టీలు తెలంగాణలో విభజన వాదం.. ఏపీలో సమైక్యవాదం పేరుతో ప్రజల్ని మోసం చేశాయని విమర్శించారు. ఏపీ ప్రభుత్వం కోవిడ్ ఎమర్జెన్సీ ప్రకటించి..15 రోజుల పాటు దానిపై దృష్టి పెట్టాలని సోము వీర్రాజు సూచించారు.