రైతును రాజుగా, పారిశ్రామిక వేత్తగా చేయడమే బీజేపీ లక్ష్యం: సోము వీర్రాజు
ABN , First Publish Date - 2020-09-21T17:29:29+05:30 IST
రైతే రాజు అయితే భారతదేశంలో సమూల మార్పులకు అవకాశం ఉంటుందని..
విజయవాడ: రైతే రాజు అయితే భారతదేశంలో సమూల మార్పులకు అవకాశం ఉంటుందని ఏపీ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ స్వామినాధన్ కమిషన్ చెప్పిన అంశాలకు పార్లమెంటులో నిన్న చేసిన బిల్లుతో సాకారం అవుతుందని, రైతును రాజుగా, పారిశ్రామిక వేత్తగా చేయడమే బీజేపీ లక్ష్యమని అన్నారు. ఆర్టికల్ 370, రామజన్మభూమి బిల్లు కన్నా ఇది చాలా గొప్పదని కొనియాడారు.
సెల్ ఫోన్ తరహాలో రైతు తమ ఉత్పత్తిని దేశంలో ఎక్కడైనా అమ్ముకోవచ్చునని సోము వీర్రాజు అన్నారు. దళారీ వ్యవస్థను ప్రోత్సహించే కాంగ్రెస్తో సహా కొన్ని రాజకీయ పార్టీలు ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నాయని విమర్శించారు. మార్కెట్ యార్డులు మూసేస్తారన్నది అసత్య ప్రచారమేనన్నారు. మార్కెట్ యార్డుల్లో దళారీ వ్యవస్థ పోతుందన్నారు. వ్యవసాయ బిల్లును ప్రతిపక్షాలు అడ్డుకోవడం సరికాదన్నారు. రైతులు పండించిన పంటలకు కనీస మద్దతు ధర అందుతుందని సోము వీర్రాజు వ్యాఖ్యానించారు.