తమిళనాడులో భారీ శబ్దం... 20 చ.కి.మీ. పరిథిలో ప్రజల ఆందోళన...

ABN , First Publish Date - 2020-05-28T23:08:52+05:30 IST

తమిళనాడులోని తిరుపూర్ జిల్లాలో గురువారం ఉదయం భారీ శబ్దం వినిపించింది.

తమిళనాడులో భారీ శబ్దం... 20 చ.కి.మీ. పరిథిలో ప్రజల ఆందోళన...

చెన్నై : తమిళనాడులోని తిరుపూర్ జిల్లాలో గురువారం ఉదయం భారీ శబ్దం వినిపించింది. తిరుపూర్ నగరం, దాని పరిసర ప్రాంతాలు దాదాపు 20 చదరపు కిలోమీటర్ల పరిథిలో ఈ శబ్దం వినిపించింది. దీంతో ఈ ప్రాంతంలోని ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఏదైనా పేలుడు సంభవించిందేమోనని భావించారు కానీ, ఈ శబ్దానికి అసలు కారణం ఏమిటో ఇంకా తెలియడం లేదు.


తిరుపూర్ జిల్లా పోలీసు సూపరింటెండెంట్ దిశ మిట్టల్ మాట్లాడుతూ, తాను కూడా ఉదయం 10.30 గంటల ప్రాంతంలో భారీ శబ్దాన్ని విన్నానని చెప్పారు. ఆ శబ్దం ఎక్కడి నుంచి వచ్చిందో అర్థం కాలేదన్నారు. బహుశా సూలూర్ వైమానిక స్థావరంలోని యుద్ధ విమానం కారణమై ఉండవచ్చునని తెలిపారు. 


స్థానికుల కథనం ప్రకారం, గురువారం ఉదయం 10.40 గంటల ప్రాంతంలో తిరుపూర్ నగరం, ధారపురం, కుండడం పరిసరాల్లో ఈ శబ్దం వినిపించింది. ఇది అసలు ఎక్కడ ప్రారంభమైంది? ఎందుకు ఈ శబ్దం వెలువడింది? అనే అంశాలపై ఇంకా స్పష్టత రాలేదు. 


ఈ ప్రాంతంలో బాలలు భయంతో వణికిపోతూ వీథుల్లోకి పరుగులు తీయడం కనిపించింది. ముఖ్యంగా ధారపురం పట్టణంతోపాటు దాని పరిసరాల్లోని గ్రామాల్లో ఈ శబ్దం భారీగా వినిపించింది. అయితే భూమి కంపించినట్లు ఆనవాళ్లేమీ లేవు. 


ములనూర్ వాసులతోపాటు కంగెయం సమీపంలోని కొన్ని ప్రాంతాల వారికి కూడా ఈ శబ్దం వినిపించింది. 


Updated Date - 2020-05-28T23:08:52+05:30 IST