ఎల్లుండి నైరుతి ఆగమనం

ABN , First Publish Date - 2021-05-19T09:27:46+05:30 IST

నైరుతి రుతుపవనాలు ఈనెల 21న దక్షిణ అండమాన్‌ సముద్రం, దాన్ని ఆనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతం ప్రాంతాల్లోకి ప్రవేశించే అవకాశాలున్నాయి...

ఎల్లుండి నైరుతి ఆగమనం

అమరావతి, విశాఖపట్నం, మే 18(ఆంధ్రజ్యోతి):  నైరుతి రుతుపవనాలు ఈనెల 21న దక్షిణ అండమాన్‌ సముద్రం, దాన్ని ఆనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతం ప్రాంతాల్లోకి ప్రవేశించే అవకాశాలున్నాయి. ఈ  విషయాన్ని భారత వాతావరణ శాఖ(ఐఎండీ)మరోసారి మంగళవారం ధ్రువీకరించింది. కాగా, హిందూ మహాసముద్రం, దానికి ఆనుకుని ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. హిందూ మహాసముద్రం నుంచి బంగాళాఖాతం వైపు తేమగాలులు వస్తున్నాయి. ఈ రెండింటి ప్రభావంతో నైరుతి రుతుపవనాలు ఈ నెల 21న దక్షిణ అండమాన్‌ సముద్రం, దానికి ఆనుకుని ఆగ్నేయ బంగాళాఖాతంలోకి ప్రవేశించనున్నాయని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. అదే విధంగా ఈ నెల 23న తూర్పు మధ్య బంగాళాఖాతం/ఉత్తర అండమాన్‌ సముద్రం పరిసరాల్లో అల్పపీడనం ఏర్పడనుందని ఐఎండీ తెలిపింది. తరువాత అల్పపీడనం బలపడి ఈ నెల 27, 28 నాటికి పశ్చిమ బెంగాల్‌/బంగ్లాదేశ్‌ తీరాల దిశగా పయనించనున్నదని నిపుణులు పేర్కొంటున్నారు. దీని ప్రభావంతో ఈ నెల 26వ తేదీ తరువాత కేరళలో నైరుతి రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉందని అంచనా వేశారు. కాగా రాష్ట్రం మీదుగా తక్కువ ఎత్తులో ఆగ్నేయ, దక్షిణ గాలులు వీస్తున్నాయి. వీటి ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా బుధ, గురువారాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని, పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2-3 డిగ్రీలు అధికంగా నమోదయ్యే అవకాశాలున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. 

Updated Date - 2021-05-19T09:27:46+05:30 IST