SP MLC Pushpraj Jain ఇల్లు, పెర్ఫ్యూమ్ సంస్థ కార్యాలయాలపై ఐటీ అధికారుల దాడి
ABN , First Publish Date - 2021-12-31T16:15:32+05:30 IST
సమాజ్వాదీ పార్టీ ఎమ్మెల్సీ, పరిమళ ద్రవ్యాల తయారీదారు పుష్పరాజ్ జైన్ ఇంటిపై ఆదాయపు పన్నుశాఖ అధికారులు శుక్రవారం దాడి చేశారు....
కన్నౌజ్ (ఉత్తరప్రదేశ్): సమాజ్వాదీ పార్టీ ఎమ్మెల్సీ, పరిమళ ద్రవ్యాల తయారీదారు పుష్పరాజ్ జైన్ ఇంటిపై ఆదాయపు పన్నుశాఖ అధికారులు శుక్రవారం దాడి చేశారు. ఉత్తరప్రదేశ్లోని కన్నౌజ్లోని సమాజ్వాదీ పార్టీ ఎమ్మెల్సీ పుష్పరాజ్ జైన్కు చెందిన పెర్ఫ్యూమ్ సంస్థ ప్రాంగణంలో శుక్రవారం ఆదాయపు పన్ను శాఖ అధికారులు సోదాలు జరిపారు.పన్ను ఎగవేతకు సంబంధించిన నిర్దిష్ట సమాచారం ఆధారంగా పుష్పరాజ్ జైన్ కార్యాలయాలు,నివాసంతో సహా దాదాపు 50 ప్రదేశాలలో సోదాలు జరుగుతున్నాయి.2022 యూపీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు పుష్పరాజ్ జైన్ గత నెలలో ఎస్పీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ సమక్షంలో తన పార్టీ పేరు సమాజ్ వాదీ ఇత్తర్ పేరిట పెర్ఫ్యూమ్ను ప్రారంభించారు.
దీంతోపాటు కన్నౌజ్లోని మహ్మద్ యాకూబ్ పెర్ఫ్యూమ్లో కూడా శుక్రవారం తెల్లవారుజామున ఐటీ శాఖ దాడులు చేసింది.అసెంబ్లీ ఎన్నికలకు ముందు అధికార పార్టీ కేంద్ర ఏజెన్సీలను దుర్వినియోగం చేస్తోందని సమాజ్ వాదీపార్టీ ఆరోపించింది.‘‘యూపీ ఎన్నికల్లో బీజేపీ ప్రతిపక్ష నేతలను భయపెట్టేందుకు కేంద్ర సంస్థలను దుర్వినియోగం చేస్తోంది.ప్రజలు అన్నీ గమనిస్తున్నారు, ఓటుతో సమాధానం చెబుతారు’’ అని ఎస్పీ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ పోస్ట్ చేసింది.ఈ నెల ప్రారంభంలో కాన్పూర్కు చెందిన పెర్ఫ్యూమ్ వ్యాపారి పీయూష్ జైన్పై దాడి చేసి అతనికి చెందిన అనేక ప్రదేశాల నుంచి రూ.150 కోట్లను స్వాధీనం చేసుకున్నారు.
ఎస్పీతో పీయూష్ జైన్కు సంబంధాలు ఉన్నాయని ఆరోపణలు వచ్చాయి. అయితే ఆ వ్యాపారవేత్తతో తమకు ఎలాంటి సంబంధాలు లేవని పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ ఖండించారు.సమాజ్ వాదీపార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఉత్తరప్రదేశ్ అంతటా అవినీతి పరిమళాన్ని ఆ పార్టీ వెదజల్లిందని ఐటీ దాడుల గురించి ఎస్పీపై ప్రధాని నరేంద్ర మోదీ విరుచుకుపడ్డారు.