సిబ్బంది నిబద్ధతతో పనిచేయాలి
ABN , First Publish Date - 2021-10-24T05:09:29+05:30 IST
జోగుళాంబ గద్వాలను గంజాయి రహిత జిల్లాగా మార్చడానికి సిబ్బంది నిబద్ధతతో పనిచేయాలని ఎస్పీ రంజన్ రతన్కుమార్ అన్నారు.
- ఎస్పీ రంజన్ రతన్కుమార్
గద్వాల క్రైం, అక్టోబరు 23 : జోగుళాంబ గద్వాలను గంజాయి రహిత జిల్లాగా మార్చడానికి సిబ్బంది నిబద్ధతతో పనిచేయాలని ఎస్పీ రంజన్ రతన్కుమార్ అన్నారు. జిల్లా కేంద్రంలోని సాయు ధ దళ కార్యాలయంలో హోంగార్డు, పోలీస్ అధికారులతో శనివారం నిర్వహించిన సమావేశంలో ఆయ న మాట్లాడారు. గంజాయి విక్రయం, రవాణా, వినియోగంపై రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్గా ఉన్నదన్న విషయాన్ని ఆయన గుర్తుచేసారు. గంజాయి వినియోగంతో యువత భవిష్యత్తు నిర్వీర్యం అవుతున్నదని, దీనివల్ల దేశ అభివృధ్ది, భవిష్యత్తు దెబ్బతినే ప్రమాదం ఉందన్నారు. యువత గంజాయి, మత్తు పదార్దాలకు బానిసలుగా మారి విచక్షణ కోల్పోయి అసాంఘిక కార్యకలాపాలకు, నేరాలకు పాల్పడుతున్న పరిస్థితులు ఏర్పడుతున్నాయన్నారు. ఆయా పోలీస్స్టేషన్ల పరిధిలో పాన్ షాపులు, కిరాణ దుకాణాలను తనిఖీ చేయడంతో పాటు యజమానులతో సమావేశం నిర్వహించాలని సూచించారు. గంజాయి, మత్తు పదార్థాల విక్రయాలతో ఎదురయ్యే అనర్థాలు, చట్టపరంగా తీసుకునే చర్యలపై అవగాహన కల్పిం చాలని చెప్పారు. సమర్థవంతంగా పనిచేసే అధికారులకు ప్రభుత్వం పలు రకాల ప్రోత్సాహకాలు ప్రకటించిందని తెలిపారు.
ప్రతీ ఒక్కరు రక్తదానం చేయాలి
ప్రతీ ఒక్కరు రక్తదానం చేసి ప్రాణదాతలు కావాలని ఎస్పీ రంజన్ రతన్కుమార్ అన్నారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా పోలీస్శాఖ ఆధ్వర్యంలో ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ సహకారంతో, సాయుధ దళ కార్యాలయంలో శనివారం మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఎస్పీ రంజన్ రతన్కుమార్ శిబిరాన్ని ప్రారంభించి మాట్లాడారు. ప్రజల రక్షణ, శాంతిభద్రతల పరిరక్షణకు పోలీస్ అధికారులు, సిబ్బంది ప్రాణాలను ఫణంగా పెట్టి ఉద్యోగాలు చేస్తున్నారన్నారు. వారి సేవలను స్ఫూర్తిగా తీసుకొని విధులు నిర్వహిస్తున్నామని చెప్పారు. శిబిరంలో 110 యూ నిట్ల రక్తం సేకరించినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఏవో సతీష్కుమార్, శాంతినగర్ సీఐ వెంకటేశ్వర్లు, ఇండియన్ రెడ్ క్రాస్ చైర్మన్ రమేష్, కోశాధికారి సంగాల అయ్యపురెడ్డి, డాక్టర్ క్రాంతికుమార్, ఎస్ఐలు హరిప్రసాద్రెడ్డి, శేఖర్, శ్రీహరి, నరేష్, విజయభాస్కర్, రమాదేవి పాల్గొన్నారు.