‘స్పందన’కు 277 ఫిర్యాదులు
ABN , First Publish Date - 2021-11-30T05:18:56+05:30 IST
ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రతి సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించే స్పందన కార్యక్రమానికి 277 ఫిర్యాదులు అందాయి.
అర్జీలను స్వీకరించిన కలెక్టర్, జేసీలు
గుంటూరు(తూర్పు), నవంబరు 29: ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రతి సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించే స్పందన కార్యక్రమానికి 277 ఫిర్యాదులు అందాయి. అర్జీలను కలెక్టర్ వివేక్యాదవ్, జేసీలు స్వీకరించారు. అంతకు ముందు నిర్వహించిన ‘డయల్ యువర్ కలెక్టర్’కు 14 ఫిర్యాదులు అందాయి. ఫోనుద్వారా వచ్చిన ఫిర్యాదులను ఆయా శాఖలకు బదిలీ చేసి వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలోజేసీలు దినేష్కుమార్, రాజకుమారి, అనుమప అంజలి, డీఆర్వో కొండయ్య, వివిధశాఖల పీడీలు, ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు.
ఉపాధ్యాయులు కావాలంటూ....
ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్మీడియం అని చెబితే పిల్లలను చేర్పించామని, కానీ అక్కడ ఉపాధ్యాయుల్లేక తీవ్రఇబ్బందులు పడుతున్నామని చుండూరుమండలంలోని మోదుకూరు ఎస్సీ కాలనీవాసులు సోమవారం స్పందనలో ఫిర్యాదు చేశారు. 70మంది విద్యార్థులున్న ఈ పాఠశాలలో గతంలో ముగ్గురు ఉపాధ్యాయులు ఉండేవారని, కానీ ఇప్పుడు ఒక్కరే పాఠాలు బోధిస్తున్నారని తెలిపారు. ప్రభుత్వంస్పందించి ఉపాధ్యాయులను కేటాయించాలని కోరారు. అర్జీ అందజేసిన వారిలో పాఠశాల పీఎంసీ కమిటీ ఛైర్మన్, వైస్ చైర్మన్లు సాల్మన్రాజు, డి.ప్రవల్లిక కాలనీవాసులు ఉన్నారు.
రైతుభరోసా అందడం లేదంటూ....
మంగళగిరి మండలం రామచంద్రాపురంలో 249 ఎకరాల 60 సెంట్లకు సంబంధించి 130 మంది రైతులకు రైతుభరోసా అందడం లేదంటూ ఆగ్రామానికి చెందిన సొసైటీ అధ్యక్షుడు నూతక్కి మధుసూదనరావు స్పందనలో ఫిర్యాదుచేశారు. 1923లో భూములను, 1989లో పట్టాలను, 1991లొ కొంతమంది రైతులకు పాస్పుస్తకాలను ప్రభుత్వం అందజేసిందని, కానీ భూముల వివరాలను ఆర్ఎస్ఆర్, వెబ్ల్యాండ్ ద్వారా ఆన్లైన్లో అధికారులు ఎక్కించడంలేదని, దీంతో రైతులు రైతుభరోసాకు దూరం అయ్యారని. ఉన్నతాధికారులు స్పందించి భూములను ఆన్లైన్లో ఎక్కించేలా చర్యలు తీసుకోవాలని వినతిపత్రంలో కోరారు.
హెల్త్క్లినిక్ కోసం దారిని మూసివేస్తున్నారు..
హెల్త్క్లినిక్ నిర్మాణం కోసం తమ ఇంటికి వెళ్లేదారిని మూసివేస్తున్నారంటూ తెనాలిలోని హయ్యర్పేటకు చెందిన వంపుగల్ల శ్రీదేవి స్పందనలో ఫిర్యాదుచేశారు. కాంట్రాక్టరు స్వలాభం కోసం తమ ఇంటి వద్ద క్లినిక్ నిర్మాణం చేపడుతున్నారని, అధికారులు ఘటనపై విచారణ జరిపి న్యాయం చేయాలని వినతిపత్రంలో పేర్కోన్నారు.