కొవిడ్ కట్టడికి ప్రత్యేక చర్యలు
ABN , First Publish Date - 2021-04-22T06:24:03+05:30 IST
పోలీస్ శాఖలో కొవిడ్ను కట్టడి చేసేందుకు ప్రత్యేకమైన చర్యలు తీసుకున్నట్లు ఎస్పీ సిద్ధార్థ కౌశల్ తెలిపారు.
వీడియో కాన్ఫరెన్స్లో ఎస్పీ ఆదేశాలు
పోలీసు సిబ్బందికి రెండు షిఫ్ట్లు
స్టేషన్లలో పంచాయితీలు వద్దు
ఒంగోలు (క్రైం), ఏప్రిల్ 21 : పోలీస్ శాఖలో కొవిడ్ను కట్టడి చేసేందుకు ప్రత్యేకమైన చర్యలు తీసుకున్నట్లు ఎస్పీ సిద్ధార్థ కౌశల్ తెలిపారు. ఈమేరకు జిల్లాలో ఉన్న పోలీసు అధికారులతో ఎస్పీ బుధవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. దశసూత్రాలను కచ్ఛితంగా అమలు చేయాలని నిర్ణయించినట్లు ఆయన తెలిపారు. ఇతర రాష్ర్టాలకు వీలైనంత వరకు సిబ్బంది వెళ్లకుండా ఉండాలన్నారు. స్టేషన్లలో పంచాయితీలు చేయవద్దన్నారు. అందుబాటులో ఉన్నవారిని ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 3 వరకు, 3 నుంచి 10 వరకు రెండు షిప్టులుగా విభజించాలని ఆదేశించారు. అదేవిధంగా సర్కిల్ స్థాయిలో నిందితులకు ప్రత్యేక నిర్బంధ కేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు. జిల్లా కార్యాలయానికి వచ్చే అర్జీదారులు ప్రధాన వద్ద వీడియోకాన్ఫరెన్స్ ద్వారా తనతో మాట్లాడే విధంగా ఏర్పాటు చేశామని తెలిపారు. ఏఎస్పీ బి.రవిచంద్ర, ఓఎస్డీ కె.చౌడేశ్వరి, ఎస్బీ డీఎస్పీ మరియదాసు పాల్గొన్నారు.