‘మౌలికం’ కోసం ప్రత్యేక బ్యాంక్!
ABN , First Publish Date - 2021-01-07T07:11:15+05:30 IST
రోడ్లు, నౌకాశ్రయాలు, విద్యుత్ ప్రాజెక్టులకు నిధులు సమకూర్చేందుకు రూ.లక్ష కోట్ల మూలధన నిధితో ప్రత్యేక బ్యాంక్ను ఏర్పా టు చేయాలని కేంద్రప్రభుత్వం భావిస్తున్నట్లు విశ్వసనీయ
- రూ.లక్ష కోట్లతో ఏర్పాటు యోచన
న్యూఢిల్లీ: రోడ్లు, నౌకాశ్రయాలు, విద్యుత్ ప్రాజెక్టులకు నిధులు సమకూర్చేందుకు రూ.లక్ష కోట్ల మూలధన నిధితో ప్రత్యేక బ్యాంక్ను ఏర్పా టు చేయాలని కేంద్రప్రభుత్వం భావిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ ప్రతిపాదనపై కేబినెట్లో చర్చించేందుకు ఆర్థిక శాఖ నోట్ కూడా తయారు చేసినట్లు తెలిసింది. ఫ్రిబవరి 1న ప్రవేశపెట్టబోయే బడ్జెట్లో ఈ బ్యాంక్ ఏర్పాటుపై అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. మౌలిక ప్రాజెక్టుల ఫండింగ్ కోసం రూ.20 వేల కోట్లతో ఇండియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్స్ కంపెనీని ప్రభుత్వం ఇప్పటికే ఏర్పాటు చేసింది. కొత్తగా ఏర్పాటు చేయబోయే బ్యాంక్లో దీన్ని విలీనం చేయనున్నట్లు సమాచారం.
ఎన్ఐఐఎఫ్ తరహాలో ఏర్పాటు
ఈ బ్యాంక్ ఏర్పాటుకు అవసరమైన నిధులను తొలుత ప్రభుత్వమే సమకూర్చనుందని, ఆ తర్వాత పెట్టుబడుల కోసం బ్యాంక్ ఇన్వెస్టర్లను ఆహ్వానించనుందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. మౌలిక ప్రాజెక్టులకు నిధులు సమకూర్చేందుకు 2015 ఫిబ్రవరిలో ఏర్పాటైన ప్రత్యేక ఫండ్ నేషనల్ ఇన్వె్స్టమెంట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్(ఎన్ఐఐఎ్ఫ)ను సైతం ప్రభుత్వం ఇదే తరహాలో ప్రారంభించింది. ఆ తర్వాత అబుదాబీ ఇన్వె్స్టమెంట్ అథారిటీ(ఏడీఐఏ), ఏషియన్ డెవల్పమెంట్ బ్యాంక్ (ఏడీబీ), కెనడా పెన్షన్ ప్లాన్ ఇన్వె్స్టమెంట్ బోర్డు ఎన్ఐఐఎ్ఫలో వాటాదారులుగా చేరాయి.
ఆర్థిక మాంద్యంలో భారత్
వరుసగా రెండు త్రైమాసికాలపాటు ప్రతికూల వృద్ధి నమోదుకావడంతో భారత్ సాంకేతికంగా ఆర్థిక మాంద్యంలోకి జారుకుంది. వృద్ధి పునరుద్ధరణకు ప్రభుత్వ వ్యయం భారీగా పెరగాల్సిన అవసరం ఉందని ఆర్థికవేత్తలంటున్నారు. ముఖ్యంగా మౌలిక వసతుల్లో పెట్టుబడులు ఇందుకు కీలకమని వారు పేర్కొన్నారు.
8న ఆర్థికవేత్తలతో ప్రధాని భేటీ
ఆర్థిక వృద్ధిని ప్రోత్సహించేందుకు బడ్జెట్లో చేపట్టాల్సిన చర్యలపై చర్చించేందుకు శుక్రవారంనాడు ప్రముఖ ఆర్థికవేత్తలు, ఆయా రంగాల నిపుణులతో ప్రధాని మోదీ సమావేశం కానున్నారు. నీతి ఆయోగ్ ఆధ్వర్యంలో ఈ భేటీ జరగనుంది. దృశ్యమాధ్యమ పద్ధతిలో జరగనున్న సమావేశంలో నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్, సీఈఓ అమితాబ్ కాంత్ సైతం పాల్గొననున్నారు.