వైసీపీ ఎమ్మెల్యే ప్రసన్న తీరుపై ఏపీ వ్యాప్తంగా చర్చలు

ABN , First Publish Date - 2021-01-19T20:23:09+05:30 IST

కోవూరు వైసీపీ ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి బహిరంగ సభలో చేసిన విమర్శలు.

వైసీపీ ఎమ్మెల్యే ప్రసన్న తీరుపై ఏపీ వ్యాప్తంగా చర్చలు

అమరావతి: నువ్వెంతా.. నీ బతుకెంతా.. ఒక్క రోజు ఉంటావో రెండు రోజులు ఉంటావో.. ఎక్కడి నుంచి వచ్చావ్.. ఎవరి ప్రభుత్వం అనుకుంటున్నావ్... ఇవన్నీ ఎవరో సామాన్యులు తిట్టుకునే తిట్లు కావు. కోవూరు వైసీపీ ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి బహిరంగ సభలో చేసిన విమర్శలు. తానొక ప్రజాప్రతినిధిననే విషయం మరిచి రెచ్చిపోతున్న వైనం.. ఇది ఏపీలో పెద్ద ఎత్తున విమర్శలకు తావిస్తోంది. వైసీపీ శ్రేణుల్లోనూ ఆయన తీరుపై అసహనం వ్యక్తమవుతోంది. తన రూటే సపరేట్‌గా రెచ్చిపోతున్న నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డిపై ఏబీఎన్ స్పషల్ స్టోరీ. పై వీడియో క్లిక్ చేయండి...


‘‘వైసీపీ నాయకులపై అసభ్య పోస్టింగ్‌ పెడితే..తెలుగుదేశం పార్టీ వాళ్లు చెప్పారని జిల్లా పోలీసు అధికారి ఎవరో  కేసు రిజిస్టర్‌ చేయవద్దని చెప్పేది ఏంది? నాకు అర్థం కాలే. ఏమనుకొంటున్నాడాయన... ఎవరనుకొంటున్నాడు....ఎవరి గవర్నమెంట్‌ అనుకొంటున్నాడు. బాగుండదు.. పద్ధతి కాదు...తమాషాలు పడొద్దు’’ అంటూ నెల్లూరు జిల్లా ఎస్పీ భాస్కర్‌భూషణ్‌పై కోవూరు వైసీపీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి తీవ్రంగా విరుచుకుపడ్డారు. ‘నెల ఉంటావో, రెండు నెలలు ఉంటావో.. ఉన్నన్ని రోజులైనా శుద్ధంగా ఉండు’ అని వార్నింగ్‌ ఇచ్చారు. ఇంటి పట్టాల పంపిణీ కార్యక్రమంలో భాగంగా సోమవారం నెల్లూరు జిల్లా కొడవలూరులో జరిగిన సభలో ఎస్పీపై ప్రసన్న ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యవహారాన్ని సీఎం దృష్టికి తీసుకుపోతానని కూడా హెచ్చరించారు.


కొద్దిరోజులక్రితం టీడీపీ అధినేత చంద్రబాబు, మాజీ మంత్రి నారా లోకేశ్‌లపై కోవూరు నియోజకవర్గం కొడవలూరుకు చెందిన వైసీపీ నాయకుడు అసభ్యకరంగా పోస్టింగులు పెట్టారు. దీన్ని సహించలేక ఒక టీడీపీ నాయకుడు పోస్టింగ్‌ పెట్టిన వైసీపీ వ్యక్తిపై అసభ్యకర పదజాలంతో తిరిగి పోస్టింగ్‌ చేశారు. దీనిపై వైసీపీ నాయకులు కొడవలూరు పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు 292 కింద కేసు నమోదు చేశారు. అయితే పోస్టింగ్‌ పెట్టిన టీడీపీ నాయకుడిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని వైసీపీ నాయకులు పట్టుబట్టారు. దీనికి ఎస్పీ భాస్కర్‌భూషణ్‌ అంగీకరించలేదని చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఇళ్ల పట్టాల పంపిణీ కోసం ఏర్పాటుచేసిన సభలో కోవూరు ఎమ్మెల్యే ప్రసన్నకుమార్‌రెడ్డి.. ఎస్పీపై విరుచుకుపడ్డారు.


‘‘ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయండి. డీఎస్పీ వచ్చి విచారిస్తారు. తప్పుడు కేసు అయితే తీసేస్తారు. నిజమని తేలితే లోపలేస్తారు. అంతేకదా!? కేసు రిజిస్టర్‌ చేయవద్దనడానికి నువ్వెవరు!? బాగుండదు. ఉన్నన్ని రోజులైనా శుద్ధంగా ఉండు. ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు! ఎవరు నేర్పించారు నీకు రూల్స్‌! ఎవరు కాపాడుతారు నిన్ను! విజయవాడలో డీజీపీ నిన్ను కాపాడుతారనుకొంటున్నావా? బాగుండదు. నువ్వు తెలుగుదేశం ఏజెంటువా.. మా జిల్లా పోలీసు అధికారివా? ఎవడో టీడీపీకి చెందిన మాజీ మంత్రి ఫోన్‌ చేసి చెబితే కేసు రిజిస్టర్‌ చేయవద్దనడానికి నువ్వు ఎవరు? ఇంతకు ముందు ఎప్పుడూ ఇలా జరగలేదు. పైగా కేసు కడితే జైల్లో వేయిస్తానని కింది సిబ్బందిని బెదిరిస్తావా? నీకుందా ఆ దమ్ము! మా ఎస్‌ఐ, సీఐల పక్కన నేను నిలబడతాను. రా! దమ్ముంటే అరెస్ట్‌ చేయించు... ఏమనుకొంటున్నావు. ఎవరి గవర్నమెంట్‌ అనుకొంటున్నావు.. నాతో పెట్టుకోవద్దు’’ అని గద్దించారు. దళిత ఎమ్మెల్యేల మీద అసభ్యంగా పోస్టింగులు పెడుతుంటే ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. 


ఎస్పీ భాస్కర్‌ భూషణ్‌పై ఎమ్మెల్యే ప్రసన్న విరుచుకుపడటం ఇది రెండవ సారి. లాక్‌డౌన్‌ సమయంలో నిబంధనలకు విరుద్ధంగా పెద్ద సంఖ్యలో ప్రజలు గుమికూడేలా కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు ఎమ్మెల్యే సహా పలువురిపై ఆయన కేసు నమోదు చేశారు. దీనిపై ప్రసన్న బుచ్చిరెడ్డిపాళెం పోలీసు స్టేషన్‌ ఎదుట ధర్నా నిర్వహించారు.  ఎస్పీపై ఈ సందర్భంగా తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. 

Updated Date - 2021-01-19T20:23:09+05:30 IST