స్పోర్ట్స్ కోటా పోస్టుల భర్తీపై నీలినీడలు
ABN , First Publish Date - 2022-01-24T05:15:43+05:30 IST
వారంతా ప్రతిభా వంతులు. పోటీ పరీక్షల్లో నెగ్గారు. సర్టిఫికెట్ల పరిశీలన కూడా పూర్తిచేసుకున్నారు. కానీ తోటివారికి ఉద్యోగాలొచ్చి నా....వీరికి మాత్రం ఇవ్వలేదు.
15 నెలలుగా ఎదురుచూపులు
డీఎస్సీ -2018 స్పోర్ట్స్ కోటా పోస్టుల
భర్తీపై జాప్యం
తప్పని ఎదురుచూపులు
అనంతపురం విద్య, జనవరి 23: వారంతా ప్రతిభా వంతులు. పోటీ పరీక్షల్లో నెగ్గారు. సర్టిఫికెట్ల పరిశీలన కూడా పూర్తిచేసుకున్నారు. కానీ తోటివారికి ఉద్యోగాలొచ్చి నా....వీరికి మాత్రం ఇవ్వలేదు. జిల్లా స్థాయిలో డీఈఓ ఆఫీస్ నుంచి కలెక్టరేట్ వరకూ, రాష్ట్ర స్థాయిలో విద్యాశాఖ కమిషనర్ ఆఫీస్ వరకూ వేడుకోని ఆఫీస్ లేదు. ఇలా 15 నెలలుగా వారు పోస్టింగ్ కోసం ఎదురుచూస్తున్నారు. ఇదీ డీఎస్సీ-2018 స్పోర్ట్స్ కోటాలో ఎంపికైన అభ్యర్థుల దుస్థితి.
ఎంపికపై దోబూచులాట...
డీఎస్సీ- 2018లో స్పోర్ట్స్ కోటా పోస్టుల భర్తీలో తీవ్ర జాప్యం జరుగుతోంది. స్పోర్ట్స్ కోటాలో సెకెండరీ గ్రేడ్ టీచర్లుగా ఎంపికైన వారికి తీరని అన్యాయం చేస్తున్నారు. ఎంపికైన అభ్యర్థులకు సుమారు 15 నెలల కిందట సర్టిఫికెట్లు వెరిఫికేషన్ పూర్తిచేశారు. 2020 అక్టోబరు మాసంలో స్పోర్ట్స్ కోటా కింద సుమారు 50 మంది వరకూ ప్రొవిజినల్ సీనియారిటీ లిస్టును ప్రదర్శించారు. జిల్లాలో ఖాళీ ఉన్న 6 పోస్టులకు అదే నెల ఆఖర్లో అర్హు లైన ఆరుగురు అభ్యర్థులకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ పూర్తి చేశారు. ఇదిగో...భర్తీ చేస్తారు..అదిగో భర్తీ చేస్తారంటూ అప్పటి నుంచి కాలయాపన జరుగుతోంది. అదే డీఎస్సీలో స్కూల్ అసిస్టెంట్స్, లాంగ్వేజ్ పండిట్స్, ఇతర కేటగిరీ పోస్టులకు ఎంపికైన వారికి ఇప్పటికే ఉద్యోగాలు ఇచ్చేశా రు. అయితే వీరికి ఎదురుచూపులు తప్పడంలేదు.
ఒకరిపై ఒకరు చెప్పుకుంటూ...
గత కొంతకాలంగా ఎంపికైన అభ్యర్థులు కాళ్లరిగేలా తిరుగుతున్నారు. జిల్లావిద్యాశాఖ అధికారులను అడిగి తే....మాకు కమిషనర్ ఆఫీస్ నుంచి అభ్యర్థుల వివరాలు, ఇతర ఆదేశాలు రాలేదంటున్నారు. శాప్ (స్పోర్స్ ఆథా రిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ)వారిని అడిగితే...స్పోట్స్ కోటా వారి వివరాలకు విద్యాశాఖ కమిషనరేట్ (సీఎ్సఈ)కి పం పామని చెబుతున్నారు. కమిషనర్ ఆఫీ్సలో విచారణ చేస్తే.... శాప్ నుంచి రావాల్సి ఉందంటూ అధికారులే ఒ కరి మీద ఒకరు నెపం మోపుతూ అభ్యర్థులకు అన్యాయం చేస్తున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే పలుమార్లు కలెక్టరేట్లోని స్పందనలో బాధిత అభ్యర్థులు విన్నవించారు. అయినా న్యాయం జరక్కపోవడంతో వారు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. అభ్యర్థులు ఆందోళన చెందుతున్నా జిల్లా విద్యాశాఖాధికారులు నోరు మెదపకపోవడంపై విమర్శలు వస్తున్నాయి.