శ్రావణి కోసం కొట్టుకున్న దేవరాజ్-సాయి.. అసలు విషయం ఇప్పుడిలా..

ABN , First Publish Date - 2020-09-11T21:53:57+05:30 IST

తెలుగు సీరియల్ నటి శ్రావణి ఆత్మహత్య కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. గంట.. గంటకో ఓ ట్విస్ట్ బయటకొస్తోంది. అసలేం జరిగింది? ఇంత

శ్రావణి కోసం కొట్టుకున్న దేవరాజ్-సాయి.. అసలు విషయం ఇప్పుడిలా..

హైదరాబాద్: తెలుగు సీరియల్ నటి శ్రావణి ఆత్మహత్య కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. గంట.. గంటకో ఓ ట్విస్ట్ బయటకొస్తోంది. అసలేం జరిగింది? ఇంత గందరగోళం ఏంటి? ఆమె ఆత్మహత్య తర్వాత రకరకాల కారణాలు బయటకొస్తున్నాయి. దేవరాజ్-సాయికృష్ణ ఒకరికొకరు ఆరోపణలు.. ప్రత్యారోపణలు చేసుకుంటున్నారు. శ్రావణి ఆత్మహత్యకు దేవ్‌రాజ్‌రెడ్డే కారణమంటూ మృతురాలి కుటుంబ సభ్యులు ఆరోపించగా... కాదు.. కాదు.. శ్రావణి ఆత్మహత్యకు సాయి, ఆమె కుటుంబ సభ్యులే కారణమంటూ దేవరాజ్‌ ఆరోపిస్తున్నాడు. ప్రస్తుతం ఈ కేసును ఓ కొలిక్కి తెచ్చేందుకు ఎస్సార్‌నగర్ పోలీసులు ఆయా కోణాల్లో దర్యాప్తును కొనసాగిస్తున్నారు. ఇప్పటికే దేవరాజ్‌రెడ్డిని అదుపులోకి తీసుకుని పలు కీలక అంశాలు రాబట్టారు. అలాగే టిక్‌టాక్ వీడియోలు, ఫోన్ రికార్డ్ ఆడియోలు, వాట్సాప్ మెసేజ్‌లను పోలీసులు పరిశీలించారు. దేవరాజ్ ఇచ్చిన సాక్ష్యాలను బట్టి సాయికృష్ణను కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించనున్నారు.


కొట్టుకున్నారు!

ఇదిలా ఉంటే గతంలో శ్రావణి జీవితంతో ఆటలాడుకున్న సాయికృష్ణ-దేవరాజ్ లీలలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. గతంలో వారిద్దరు కొట్టుకున్న దృశ్యాలు ఇప్పుడు హల్‌చల్ చేస్తున్నాయి. తలలు పగులకొట్టుకునేంతగా దాడులకు తెగబడ్డారు. అంతలా కొట్టుకోవడానికి కారణమేంటి? అనేది ఈ కథనంలో చూద్దాం. 


అసలేం జరిగిందంటే..

గతంలో ఎస్సార్‌నగర్‌లో నమోదైన కేసులో జైలు నుంచి విడుదలైన తర్వాత శ్రావణిని దేవ‌రాజ్‌ కలిశాడు. దేవ‌రాజ్‌పై ఉన్న ప్రేమతో శ్రావణి సెల్ఫీ వీడియో తీసుకుంది. ఈ విషయం కుటుంబ సభ్యులకు తెలియకుండా జాగ్రత్త పడింది. కుటుంబ సభ్యులు మాత్రం దేవరాజ్‌పై ఆగ్రహంతో రగిలిపోయారు. పలుమార్లు దేవ‌‌రాజ్‌ కూడా శ్రావణి కుటుంబ సభ్యులను బెదిరించాడు. శ్రావణిని రోడ్డుపైకి ఈడుస్తా? అంటూ బెదిరించాడు. విషయం తెలుసుకున్న శ్రావణి.. దేవ‌రాజ్‌ను నిలదీసింది. శ్రావణితో పాటు దేవరాజ్‌ను కలవడానికి ఆమె సోదరుడు, సోదరి, శ్రావణి బావ కూడా వచ్చారు. ఫొటోలు, వీడియోలపై కుటుంబ సభ్యులంతా నిలదీశారు. అదే సమయంలో దేవరాజ్‌-ఆమె కుటుంబ సభ్యుల మధ్య మాటామాట పెరగడంతో దేవ‌రాజ్‌పై దాడికి పాల్పడ్డారు.


గొడవ జరిగిందిలా..!?

అనంతరం దేవరాజ్... శ్రావణి కుటుంబ సభ్యులపై పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అదే సమయంలో దేవరాజ్‌పై శ్రావణి కూడా ఎస్సార్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ కేసులో దేవరాజ్‌పై 354 కింద కేసు నమోదు చేసి జైలుకు పంపించారు. ఆ తర్వాత బెయిల్‌పై విడుదలయ్యాక కూడా దేవరాజ్‌తో శ్రావణి సన్నిహితంగా మెలిగింది. ఆత్మహత్యకు రెండ్రోజుల ముందే పంజాగుట్ట శ్రీకన్య రెస్టారెంట్‌‌లో శ్రావణి-దేవరాజ్ కలుసుకున్నారు. అదే సమయంలో సాయికృష్ణ కూడా అక్కడికొచ్చాడు. ఈ సందర్భంగా దేవ‌రాజ్-సాయికృష్ణ మద్య మాటామాట పెరిగి మళ్లీ గొడవ పడ్డారు. ఈ గొడవ జరిగాక సాయి.. శ్రావణిని కూడా కొట్టినట్టుగా ఒక వీడియోలో వినిపించింది. అంతేకాదు కుటుంబ సభ్యులు కూడా తనపై దాడి చేశారని శ్రావణి ఓ వీడియోలో వాపోయింది.


అసలు శ్రావణి ఆత్మహత్యకు దేవరాజ్ కారణమా? లేక సాయి కారణమా? కుటుంబ సభ్యులు కారణమా?.. ఆమె ఎందుకు  ఆత్మహత్య చేసుకుంది. ఎవరామెను ఇబ్బంది పెట్టారో తేల్చే పనిలో ఎస్సార్‌నగర్ పోలీసులు నిమగ్నమయ్యారు. ఈ కేసును సీరియస్‌గా తీసుకున్న పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2020-09-11T21:53:57+05:30 IST