సామ్రాజ్య లక్ష్మీప్రదా!

ABN , First Publish Date - 2020-10-25T05:31:46+05:30 IST

విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మ వారు నవరాత్రి మహోత్సవాల్లో విజయ దశమి రోజున శ్రీరాజరాజేశ్వరిదేవిగా దర్శనమిస్తారు...

సామ్రాజ్య లక్ష్మీప్రదా!

  • దుర్గా నవరాత్రులు
  • నేటి అలంకారం శ్రీరాజరాజేశ్వరిదేవి
  • ఆశ్వయుజ శుద్ధ దశమి (విజయదశమి)- ఆదివారం


  • అంబా శాంభవి చంద్రమౌళి రబలా అపర్ణా ఉమా పార్వతీ
  • కాళీ హైమవతీ శివా త్రినయనీ కాత్యాయనీ భైరవీ
  • సావిత్రీ నవయౌవనా శుభకరీ సామ్రాజ్య లక్ష్మీప్రదా
  • చిద్రూపీ పరదేవతా భగవతీ శ్రీ రాజరాజేశ్వరీ


విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మ వారు నవరాత్రి మహోత్సవాల్లో విజయ దశమి రోజున శ్రీరాజరాజేశ్వరిదేవిగా దర్శనమిస్తారు. సకల భువన బ్రహ్మాండాలకు అధిదేవత ఆమె. షోడశ మహామంత్ర స్వరూపిణి అయిన అమ్మను మహాత్రిపుర సుందరిగా, అపరాజితాదేవిగా భక్తులు ఆరాధిస్తారు. అపరాజితాదేవి పేరు మీద ‘విజయదశమి’ ఏర్పడింది. విజయాన్ని సాధించింది కాబట్టి ‘విజయ’ అని అంటారు. పరమ శాంతి స్వరూపంతో, చిరునవ్వులు చిందిస్తూ, చెరుకుగడ చేతితో పట్టుకుని ఆమె దర్శనమిస్తుంది. మణిద్వీపంలో శ్రీపురంలో నివాసం ఉండే ఆమెను ‘చింతామణి’గా పిలుస్తారని ప్రతీతి. పరమేశ్వరుడి అంకం ఆసనంగా... ఇచ్ఛా, జ్ఞాన, క్రియా శక్తులను భక్తులకు అనుగ్రహిస్తుంది. యోగమూర్తిగా మాయామోహిత మానవ చైతన్యాన్ని ఉద్దీపనం చేస్తుంది. అనంత శక్తి స్వరూపమైన శ్రీ చక్రానికి ఈ తల్లి అధిష్ఠాన దేవత.  ఆమెను కొలిస్తే సమస్త శక్తులూ సమకూరుతాయనీ, ఆ అమ్మ భక్తుల కోరికలను నెరవేరుస్తుందనీ, బ్రహ్మజ్ఞానం కలుగజేస్తుందనీ నమ్మిక.  దసరా ఉత్సవాల సంపూర్ణ పుణ్యాన్ని భక్తులందరికీ అందించే చల్లని తల్లి దుర్గమ్మను రాజరాజేశ్వరీదేవి అలంకారంలో దర్శిస్తే సకల శుభాలు, విజయాలు లభిస్తాయన్నది భక్తుల విశ్వాసం.


నైవేద్యం: పరమాన్నం, ఆరు రుచులతో కూడిన (షడ్రసోపేత) పదార్థాలు

అలంకరించే చీర రంగు: ఆకుపచ్చ, తెలుపు

అర్చించే పూల రంగు: ఎరుపు

పారాయణ: చెయ్యాల్సింది: లలితా సహస్రనామం

అర్చన: ఎర్రటి గాజులతో అలంకరించి... కుంకుమార్చన


Updated Date - 2020-10-25T05:31:46+05:30 IST