శ్రీకాకుళంలో మొదటి విడత కొవిడ్ వ్యాక్సినేషన్

ABN , First Publish Date - 2021-01-16T18:52:30+05:30 IST

జిల్లాలో మొదటి విడత కొవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమం శనివారం ప్రారంభమైంది.

శ్రీకాకుళంలో మొదటి విడత కొవిడ్ వ్యాక్సినేషన్

శ్రీకాకుళం: జిల్లాలో మొదటి విడత కొవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమం శనివారం ప్రారంభమైంది. జిల్లాలో ఏర్పాటు చేసిన 18 వాక్సినేషన్ కేంద్రాల్లో కార్యక్రమం మొదలైంది. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ధర్మాన క్రిష్ణదాస్, రాష్ట్ర శాసన సభాపతి తమ్మినేని సీతారాం శ్రీకాకుళం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో వాక్సినేషన్ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. వాక్సినేషన్ ప్రారంభ కార్యక్రమంలో భాగంగా దేశ ప్రధాని నరేంద్రమోడి దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన కార్యక్రమాన్ని ఆన్‌లైన్ ద్వారా ప్రదర్శించారు. ప్రధాని నరేంద్రమోడి మాట్లాడుతూ దేశంలో పెద్ద వాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభం అవుతోందన్నారు. వాక్సినేషన్ తయారీ కార్యక్రమంలో పాల్గొన్న శాస్త్రవేత్తలకు, వారి వైజ్ఞానిక దక్షతకు అభినందించారు. వాక్సినేషన్ కార్యక్రమం జరిగిన 30 రోజుల తరువాత కరోనా వైరస్‌ను ఎదుర్కొనే సామర్థ్యం శరీరానికి కలుగుతుందని పేర్కొన్నారు. అప్పటి వరకు ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలని, భౌతిక దూరం పాటించాలని, చేతులు తరచూ శుభ్రపరచు కోవాలని పిలుపునిచ్చారు. దేశంలో మొదటి విడతలో 3 కోట్ల మందికి, రెండవ విడతలో 30 కోట్ల మందికి వాక్సినేషన్ జరుగుతుందని చెప్పారు. వ్యాక్సిన్ పూర్తిగా కేంద్ర ప్రభుత్వ ఖర్చుతో తయారు చేయడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా ప్రముఖ కవి గురజాడ అప్పారావు చెప్పిన దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులోయ్ అనే మాటలను ప్రధాని మోదీ గుర్తుచేశారు. 


జిల్లాకు పూణే  సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా తయారు చేసిన కోవిషీల్డ్  2,650 కోవిడ్ వ్యాక్సిన్లు రాగా వాటిని 26,500 మందికి వేసేందుకు అవకాశం ఉంది. అయితే మొదట విడతలో ఆరోగ్య సిబ్బందికి మాత్రమే నిర్ధేశించిన సంగతి అందరికి విదితమే. ఇప్పటి వరకు 21,943 మంది ఆరోగ్య సిబ్బంది నమోదు అయ్యారు. మొదటి విడత వాక్సినేషన్ కార్యక్రమంలో గర్భిణీలు, బాలింతలను మినహాయించారు. ప్రతి కొవిడ్ వ్యాక్సినేషన్ కేంద్రం వద్ద వ్యాక్సినేషన్ చేసే బృందంలో మహిళ పోలీస్, డిజిటల్ అసిస్టెంట్, వాక్సినేషన్ అధికారి, అంగన్వాడి కార్యకర్త, ఆషా కార్యకర్త సభ్యులుగా బృందాన్ని ఏర్పాటు చేసారు. ప్రతి వ్యాక్సినేషన్ కేంద్రానికి ఒక వైద్యాధికారిని నిర్వహణాధికారిగా నియమించారు.  


ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు ధర్మాన ప్రసాద రావు, జిల్లా కలెక్టర్ జె నివాస్, వార్డు, గ్రామ సచివాలయ విభాగం జాయింట్ కలెక్టర్ డా.కె.శ్రీనివాసులు,  ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్.ఏ.కృష్ణ మూర్తి, ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఏ.కృష్ణ వేణి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి  డాక్టర్ కె.సి.చంద్ర నాయక్, అదనపు వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ బి.జగన్నాథ రావు, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ ఎల్. భారతీ కుమారి దేవి, డీటీటీ పీవో డాక్టర్ జె.కృష్ణమోహన్, మునిసిపల్ మాజీ చైర్మన్ ఎం.వి.పద్మావతి, రిమ్స్ హెచ్‌డీఎస్ సభ్యులు వరుదు విజయ కుమార్, లయన్స్ క్లబ్ ప్రతినిధులు నటుకుల మోహన్, దేవ భూషణ్ రావు, ప్రకాష్, రమేష్, వైద్యులు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-01-16T18:52:30+05:30 IST