వలస కూలీల దిగుమతి!
ABN , First Publish Date - 2021-12-05T04:23:14+05:30 IST
వ్యవసాయ పనులకు వలస కూలీల దిగుమతి జోరందుతుంది. పశ్చిమ బెంగాల్తో పాటు ఏపీలోని శ్రీకాకుళం, విజయనగరం, గుంటూరు జిల్లాల నుంచి కూలీలు వస్తున్నారు.
పశ్చిమ బెంగాల్, శ్రీకాకుళం, విజయనగరం నుంచి రాక
ఎకరాలకు రూ. 4 వేలు
నెల్లూరురూరల్, డిసెంబరు 4 : వ్యవసాయ పనులకు వలస కూలీల దిగుమతి జోరందుతుంది. పశ్చిమ బెంగాల్తో పాటు ఏపీలోని శ్రీకాకుళం, విజయనగరం, గుంటూరు జిల్లాల నుంచి కూలీలు వస్తున్నారు. నెల్లూరురూరల్ మండలంలోని తూర్పు, పడమర ప్రాంతాల్లో వరద ప్రభావిత ప్రాంతాలు మినహాయించి మిగిలిన గ్రామాల్లో వ్యవసాయ పనులు జోరందుకున్నాయి. ఇప్పటికే నారుమళ్లు సిద్ధమవడంతో వరినాట్లు సాగుతున్నాయి. నెల్లూరుకు తూర్పు, పడమర ప్రాంతాల్లో సుమారు 25 వేల ఎకరాలు సాగుకు సిద్ధం కాగా, 2 వేల ఎకరాల్లో వరద ప్రభావం తలెత్తిన కారణంగా మళ్లీ వరి నారుమడులు సిద్ధం చేస్తున్నారు. మిగిలిన 23 వేల ఎకరాల్లో సాగు పనులు షురూ అయ్యాయి. దీంతో ఈ దఫా మండలంలోని పలు గ్రామాలకు బయట నుంచి వలస కూలీలు భారీగా దిగుమతయ్యారు. ఎక్కువుగా పశ్చిమబెంగాల్ రాష్ట్రం నుంచి వరి నాట్లుకు కూలీలు వచ్చారు. వీరితో పాటు మన రాష్ట్రంలోని శ్రీకాకుళం, గుంటూరు, విజయనగరం జిల్లాల నుంచి కూడా కూలీలు రావడంతో పల్లెల్లో వ్యవసాయ కూలీలకు గత్తర లేదు. వీరు వరి నాట్లకు ఎకరానికి రూ.4 వేలు చొప్పున వసూలు చేస్తున్నారు. వరి నాట్లుతో పాటు నారుమళ్లు తీయడం కూడా ఇందులోనే ఉండటంతో రైతులకు కాస్త ఊరటగా ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో ఇదే కూలీలు ఎకరాలకు గరిష్టంగా రూ.7 వేలు చొప్పున వసూలు చేశారు. అటు కాలువలు, ఇటు చెరువుల్లో సాగునీరు పుష్కలంగా ఉండటంతో వ్యవసాయ పనులు ముమ్మరంమయ్యాయి. స్థానికంగా ఉండే మేస్త్రీలు వీరిని బయట ప్రాంతాల నుంచి తీసుకువచ్చి మండలంలోని పలు గ్రామాలలో వ్యవసాయ పనుల్లో భాగస్వాములను చేస్తున్నారు.