శ్రీనగర్‌లో రికార్డులకెక్కిన ‘శుక్రవారం రాత్రి’

ABN , First Publish Date - 2021-12-18T23:37:47+05:30 IST

జమ్మూకశ్మీర్ వేసవి రాజధాని శ్రీనగర్ మరోమారు రికార్డులకెక్కింది. శుక్రవారం ఈ సీజన్‌లోనే

శ్రీనగర్‌లో రికార్డులకెక్కిన ‘శుక్రవారం రాత్రి’

శ్రీనగర్: జమ్మూకశ్మీర్ వేసవి రాజధాని శ్రీనగర్ మరోమారు రికార్డులకెక్కింది. శుక్రవారం ఈ సీజన్‌లోనే అత్యంత కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఆ రోజు రాత్రి మైనస్ 6 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డైంది. ఫలితంగా గత దశాబ్ద కాలంలో రెండో అత్యంత శీతల రాత్రిగా రికార్డు పుస్తకాల్లోకి ఎక్కింది.


ఉష్ణోగ్రతలు మున్ముందు మరింత పడిపోతాయని వాతావరణశాఖ హెచ్చరించింది. ఉష్ణోగ్రతలు మైనస్ 6 డిగ్రీలకు పడిపోవడం గత దశాబ్దకాలంలో ఇది రెండోసారని వాతావరణశాఖ తెలిపింది.


ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన బారాముల్లా జిల్లాలోని గుల్‌మార్గ్ రిసార్ట్ వద్ద మైనస్ 8.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మిగతా ప్రాంతాల్లోనూ ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోయాయి.


జమ్మూకశ్మీర్‌లో 1934వ సంవత్సరం డిసెంబరు నెలలో మైనస్ 12.8 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోయింది. దక్షిణ కశ్మీర్‌లోని మరో ప్రముఖ రిసార్ట్ అయిన పహల్గావ్‌లో మైనస్ 8.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా, షోపియాన్‌లో మైనస్ 8.3 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. 


ఉత్తర కశ్మీర్‌లోని కుప్వారాలో మైనస్ 6.1 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదు కాగా, అంతకుముందు రోజు మైనస్ 4.4 డిగ్రీలు నమోదైనట్టు అధికారులు తెలిపారు. కేంద్ర పాలిత ప్రాంతమైన లడఖ్‌లోనూ ఇలాంటి పరిస్థితులే నెలకొన్నాయి.


లేహ్‌లో మైనస్ 15.3 డిగ్రీలు నమోదు కాగా, కార్గిల్‌లో మైనస్ 13.1 డిగ్రీలు, ద్రాస్ గ్రామంలో మైనస్ 19.7 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.  ఈ నెల 23 నుంచి 25 వరకు ఓ మోస్తరు నుంచి భారీగా మంచు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది.  

Updated Date - 2021-12-18T23:37:47+05:30 IST