పెద్దపల్లి కేసు : నాలుగు నెలల క్రితమే ప్లాన్.. కానీ...

ABN , First Publish Date - 2021-02-23T06:44:55+05:30 IST

రాష్ట్రవ్యాప్తంగా సంచనలం సృష్టించిన న్యాయవాద దంపతుల హత్య కేసులో నిందితుడైన బిట్టు శ్రీను అలియాస్‌ తులసిగరి శ్రీనివా్‌సను పోలీసులు అరెస్టు చేశారు.

పెద్దపల్లి కేసు : నాలుగు నెలల క్రితమే ప్లాన్.. కానీ...

  • న్యాయవాదుల హత్య కేసులో బిట్టు శ్రీను అరెస్టు
  • పుట్ట లింగమ్మ ట్రస్టును చులకన చేయడం వల్లనే హత్యకు ప్లాన్‌.. 
  • నాలుగు మాసాల క్రితమే గుంజపడుగులో హత్య చేసేందుకు యత్నం
  • మంది ఉండడంతో వెనకడుగు
  • వివరాలు వెల్లడించిన నార్త్‌ జోన్‌ ఐజీపీ నాగిరెడ్డి

పెద్దపల్లి, ఫిబ్రవరి 22 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రవ్యాప్తంగా సంచనలం సృష్టించిన న్యాయవాద దంపతుల హత్య కేసులో నిందితుడైన బిట్టు శ్రీను అలియాస్‌ తులసిగరి శ్రీనివా్‌సను పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో అతడు ఇతర నిందితులతో కలిసి కుట్రలో పాల్గొని, వారికి కారు, కత్తులను అందించినట్టు పోలీసులు సోమవారం రాత్రి ఒక ప్రకటనలో వెల్లడించారు. ఈ నెల 17న రామగిరి మండలం కల్వచర్ల సమీపంలో హైకోర్టు న్యాయవాదులు గట్టు వామన్‌రావు, ఆయన భార్య నాగమణి దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఈ కేసులో  నిందితుడైన బిట్టు శ్రీనును 19న పోలీసులు అదుపులోకి తీసుకుని నాలుగు రోజులుగా విచారిస్తున్నారు. అతడి వాంగ్మూలాన్ని రికార్డు చేసిన తర్వాత సోమవారం రాత్రి పోలీసులు అరెస్టును చూపారు. 2016 నుంచి బిట్టు శ్రీను ‘పుట్టలింగమ్మ చారిటబుల్‌ ట్రస్టు’కు చైర్మన్‌గా వ్యవహరిస్తున్నాడు. 


ఆ ట్రస్టు సేవాకార్యక్రమాలపై వామన్‌రావు పలు ఆరోపణలు చేయడం వల్లనే తాను ఈ హత్య విషయంలో కుంట శ్రీనివా్‌సకు సహకారం అందించినట్టు బిట్టు శ్రీను వెల్లడించాడని పోలీసులు తెలిపారు. 2015 నుంచి 2019 ఏప్రిల్‌ వరకు మంథని గ్రామ పంచాయతీలో బిట్టు శ్రీను చెత్త రవాణా కోసం ఒక ట్రాక్టర్‌ పెట్టగా దాని ద్వారా నెలకు రూ.30 వేల ఆదాయం వచ్చేది. ఆ ట్రాక్టర్‌ను పంచాయతీ నుంచి తీసి వేయాలని 2019 మార్చిలో పంచాయతీ అధికారిపై వామన్‌రావు ఒత్తిడి తీసుకురావడంతో ట్రాక్టరును తొలగించారని పోలీసులు పేర్కొన్నారు. నెల నెలా వచ్చే రూ.30 వేల ఆదాయాన్ని కోల్పోవడమే కాక.. దీన్ని తన విజయంగా వామన్‌రావు సోషల్‌ మీడియాలో ప్రచారం చేసుకోవడంతో ఆయనపై కక్ష పెంచుకున్నట్టు బిట్టు శ్రీను వెల్లడించాడని తెలిపారు. 


నాలుగు నెలల క్రితమే..

పోలీసులకు బిట్టు శ్రీను ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం.. గుంజపడుగు గ్రామానికి చెందిన కుంట శ్రీనివా్‌సతో బిట్టు శ్రీనివా్‌సకు ఆరేళ్ల క్రితం స్నేహం ఏర్పడింది. ఇద్దరూ ప్రాణ స్నేహితులయ్యారు. మద్యం తాగే సమయంలో వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడుకునే వాళ్లు. ఈ క్రమంలోనే వారి మధ్య వామన్‌రావు దంపతుల గురించి చర్చ వచ్చింది. గుంజపడుగు గ్రామానికే చెందిన వామన్‌రావు దంపతులతో కుంట శ్రీనుకు కూడా శత్రుత్వం ఉంది. గ్రామంలో తన ఆధిపత్యానికి వామన్‌రావు అడ్డు వస్తున్నట్టు భావించిన కుంట శ్రీను.. బిట్టు శ్రీనుతో కలిసి హత్యకు ప్రణాళిక రచించాడు. అందులో భాగంగా నాలుగు మాసాల క్రితమే.. గుంజపడుగుకు వచ్చిన వామన్‌రావును హత్య చేసేందుకు కుంట శ్రీనివాస్‌ యత్నించాడు. ఆయనను హత్య చేసేందుకు బిట్టు శ్రీనివాస్‌ ట్రాక్టర్‌ పట్టీలతో రెండు కత్తులు తయారు చేయించి.. చిరంజీవి ఇంట్లో పెట్టాడు. నాలుగు నెలల క్రితం వామన్‌ రావు 15 మందితో మూడు కార్లలో మంథని కోర్టుకు వచ్చారు. వారిని చూసిన చిరంజీవి.. బిట్టు శ్రీనుకు సమాచారం ఇవ్వగా, అతడు ఆ విషయాన్నికుంట శ్రీనివా్‌సకు చెప్పాడు. దీంతో వామన్‌రావును హత్య చేసేందుకు కుంట శ్రీను గుంజపడుగు బస్టా్‌పలో కొద్దిసేపు ఎదురు చూశాడు. 


అయితే వామన్‌రావు ఎక్కువ మందితో రావడంతో హత్యాయత్నాన్ని అప్పటికి విరమించుకున్నాడు. కానీ, వామన్‌రావు ఒంటరిగా దొరికే సమయం కోసం ఎదురుచూస్తూనే ఉన్నాడు. ఈ నెల 17న మధ్యాహ్నం.. వామన్‌రావు దంపతులు మంథని కోర్టుకు వచ్చినట్టు.. కోర్టు వద్ద ఉన్న లచ్చయ్య కుంటశ్రీనుకు తెలిపాడు. అతడు వెంటనే బిట్టు శ్రీనివా్‌సకు ఫోన్‌ చేసి విషయం చెప్పాడు. బిట్టు శ్రీను శివనందుల చిరంజీవికి ఫోన్‌ చేసి.. కత్తులను తీసుకుని అర్జెంట్‌గా మంథని బస్టాప్‌ దగ్గరికి రావాలని చెప్పాడు. చిరంజీవి ద్విచక్ర వాహనంపై కత్తులు తీసుకుని రాగా, బిట్టు శ్రీను తన కారును చిరంజీవికి ఇచ్చి పంపాడు. కల్వచర్ల వద్ద వామన్‌రావు దంపతులను చంపిన అనంతరం.. చిరంజీవి ఆ విషయాన్ని బిట్టు శ్రీనుకు ఫోన్‌ చేసి చెప్పాడు. వెంటనే మహారాష్ట్రకు వెళ్లిపోవాల్సిందిగా బిట్టు శ్రీను చిరంజీవికి సూచించాడు. కాగా.. చిరంజీవి వినియోగించిన మోటార్‌ సైకిల్‌, ఒక సెల్‌ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు.


కొనసాగుతున్న దర్యాప్తు..

న్యాయవాదుల హత్యకేసుపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని నార్త్‌ జోన్‌ ఐజీ నాగిరెడ్డి తెలిపారు. ఆధారాలను శాస్త్రీయంగా విశ్లేషించాల్సిన అవసరం ఉందని, ఇంకా కొంత మంది సాక్షులను కూడా విచారించి వారి వాంగ్మూలాన్ని నమోదు చేయాల్సి ఉందని పేర్కొన్నారు. నిందితులందరినీ పోలీస్‌ కస్టడీకి తీసుకుని పూర్తి స్థాయిలో విచారణ జరుపుతామన్నారు. హైదరాబాద్‌ ఫోరెన్సిక్‌ సైన్స్‌ ల్యాబ్‌ నిపుణులు, సైబర్‌ క్రైమ్‌ పరిశోధకులను విచారణ సహాయకులుగా తీసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. హత్యకు సంబంధించిన వీడియోల సమాచారం, ప్రత్యక్ష సాక్ష్యాలు ఉన్న వాళ్లు ముందుకు వచ్చి సమాచారం ఇస్తే ప్రతి అంశాన్నీ దర్యాప్తులో నిర్ధారించుకుని ముందుకు సాగుతామన్నారు.

Updated Date - 2021-02-23T06:44:55+05:30 IST