18నుంచి శ్రీవారి పవిత్రోత్సవాలు

ABN , First Publish Date - 2021-08-01T06:58:26+05:30 IST

తిరుమల శ్రీవారి ఆలయంలో ఆగస్టు 18 నుంచి 20వ తేదీ వరకు పవిత్రోత్సవాలు జరగనున్నాయి. 17న అంకురార్పణతో ఈ ఉత్సవాలను ప్రారంభించనున్నారు.

18నుంచి శ్రీవారి పవిత్రోత్సవాలు

తిరుమల, జూలై 31 (ఆంధ్రజ్యోతి): తిరుమల శ్రీవారి ఆలయంలో ఆగస్టు 18 నుంచి 20వ తేదీ వరకు పవిత్రోత్సవాలు జరగనున్నాయి. 17న అంకురార్పణతో ఈ ఉత్సవాలను ప్రారంభించనున్నారు. ఏడాది పొడవునా ఆలయంలో జరిగే అర్చనలు, ఉత్సవాల్లో యాత్రికుల వల్లగానీ, సిబ్బంది వల్లగానీ కొన్ని దోషాలు జరుగుతుంటాయి. వీటివల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా ఆగమశాస్త్రం ప్రకారం ఈ పవిత్రోత్సవాలను నిర్వహించడం ఆనవాయితీ. ఈ ఉత్సవాల్లో భాగంగా మూడురోజుల పాటు ఉదయం 9 నుంచి 11 గంటల వరకు ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు.సాయంత్రం 6 నుంచి రాత్రి 7 గంటల వరకు ప్రత్యేకంగా అలంకరించిన ఆభరణాలతో శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామిని ఆలయంలోని రంగనాయక మండపంలో వేంచేపు చేస్తారు. 18వ తేదీన ప్రతిష్ట, 19న పవిత్ర సమర్పణ, 20న పూర్ణాహుతి నిర్వహిస్తారు. కాగా ఆగస్టు నెలలో 11వ తేదీన శ్రీవారి పురుశైవారి తోటోత్సవం, 13న గరుడపంచమి, శ్రీవారి గరుడసేవ, 16న మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ వర్థంతి కార్యక్రమాలు నిర్వహించనున్నారు. అలాగే 22న శ్రావణ పౌర్ణిమ, విఖనస మహాముని జయంతి, 23న శ్రీవారిని విఖనసాచార్యులవారి సన్నిధికి వేంచేపు, 30న శ్రీకృష్ణాష్టమి, తిరుమల శ్రీవారి ఆలయంలో ఆస్థానం, 31న శ్రీవారి శిక్యోత్సవాలను వైభవంగా నిర్వహించనున్నారు. 

Updated Date - 2021-08-01T06:58:26+05:30 IST