శ్రీవారి ప్రసాదమా.. సుబ్బారెడ్డి స్వీట్సా?

ABN , First Publish Date - 2020-05-28T12:47:16+05:30 IST

శ్రీవారి ప్రసాదమా.. సుబ్బారెడ్డి స్వీట్సా?

శ్రీవారి ప్రసాదమా.. సుబ్బారెడ్డి స్వీట్సా?

  • ఎమ్మెల్సీ గౌనివారి విమర్శ 
  • ‘మహానాడు’ వీడియో కాన్ఫరెన్స్‌కు హాజరైన నాయకులు 

చిత్తూరు : ‘పవిత్రమైన శ్రీవారి లడ్డూను ఎక్కడబడితే అక్కడ విక్రయిస్తే ప్రసాదమెలా అవుతుంది? పుల్లారెడ్డి స్వీట్స్‌లాగా.. స్వామి ప్రసాదాన్ని సుబ్బారెడ్డి స్వీట్స్‌లా విక్రయిస్తున్నారని ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులు విమర్శించారు. బుధవారం టీడీపీ 38వ మహానాడు కార్యక్రమం ప్రారంభమైంది. లాక్‌డౌన్‌ దృష్ట్యా జిల్లా టీడీపీ కార్యాలయంలో జరిగిన చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్‌కు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు పులివర్తి నాని, ఎమ్మెల్సీ దొరబాబు తదితరులు హాజరయ్యారు. శాంతిపురంలోని తన స్వగృహం నుంచి ఎమ్మెల్సీ గౌనివారి హాజరయ్యారు. జిల్లా నుంచి ఐదు వేలమందికిపైగా టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఇళ్ల నుంచే పార్టీ అధినేత ప్రసంగాన్ని వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా వీక్షించారు.     

దాతలెలా ముందుకు వస్తారు? 

శాంతిపురంలోని తన స్వగృహం నుంచి బుధవారం సాయంత్రం ఎమ్మెల్సీ గౌనివారి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడుతూ.. ఇటు టీటీడీ ఆస్తులు, అటు ఆరుబయట శ్రీవారి లడ్డూలను విక్రయించడం హిందువుల మనోభావాలను దెబ్బతీయడమే అన్నారు. ఇలాగైతే శ్రీవారికి ఆస్తులు కానుకగా ఇవ్వడానికి దాతలు ముందుకురారని హెచ్చరించారు. ఆదాయం తక్కువగా వస్తోందంటూ పేదలు, మధ్యతరగతి ఆశ్రయించే టీటీడీ కల్యాణ మండపాలను టీటీడీ విక్రయించాలని చూస్తోందని ఆరోపించారు. శ్రీవెంకటేశ్వరస్వామి ఆస్తుల పరిరక్షణకు లోకల్‌ అడ్వైజరీ కమిటీలు ఏర్పాటు చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఏఎస్‌ మనోహర్‌, కఠారి ప్రవీణ్‌, వైవీరాజేశ్వరి, కాజూరు బాలాజి, జహంగీర్‌ ఖాన్‌, శేషాద్రి నాయుడు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-05-28T12:47:16+05:30 IST