పండుగ వేళ విషాదం
ABN , First Publish Date - 2021-10-17T05:28:27+05:30 IST
పండుగ వేళ విషాదం
ఎస్సారెస్పీ కెనాల్లో పడి ఇద్దరి మృతి
ఇద్దరూ పెద్దమ్మగడ్డ వాసులే
కన్నీరుమున్నీరైన కుటుంబ సభ్యులు
హనుమకొండ క్రైం, అక్టోబర్ 16: దసరా పండగ పర్వదినం రోజు రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆటోను కడిగేందుకు కెనాల్లోకి దిగి ఇద్దరు నీటిలో మునిగి గల్లంతయ్యారు. హన్మకొండ సీఐ వేణుమాధవ్ తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దమ్మగడ్డకు చెందిన అచుకట్ల మహేశ్ (27) అచుకట్ల నిఖిల్ (14)తో పాటు మరో ప్రత్యక్ష సాక్షి చరణ్ శుక్రవారం మధ్యాహ్నం దసరా పండగ సందర్భంగా ఆటోను నీటితో శుభ్రం చేసేందుకు పక్కనే ఉన్న కెనాల్కు వెళ్లారు. ఒడ్డుపై ఆటోను నిలిపి బకెట్ల ద్వారా కెనాల్ నుంచి నీటిని తోడి తెచ్చి ముగ్గురు కలిసి శుభ్రం చేస్తున్నారు. ఈ క్రమంలో బకెట్తో నీళ్లు తెస్తున్న నిఖిల్ కాలుజారి ప్రవహిస్తున్న నీటిలో పడిపోయాడు. ప్రవాహంలో కొట్టుకుపోతూ ‘కాపాడండి..’ అంటూ అరుపులు వేశాడు. ఇది విన్న మహేశ్ కాపాడేందుకు నీటిలో దూకాడు. ఇద్దరూ నీటిలో కొట్టుకుపోతుండడంతో ఒడ్డుపై ఉన్న చరణ్ పరుగులు పెడుతూ కాపాడండి.. కాపాడండి.. అంటూ కేకలు వేశాడు. తెలిపాడు. మహేశ్, నిఖిల్లు నీటిలో కొంతదూరం వెళ్లిన తర్వాత కనిపించలేదని చెప్పాడు.
విషయాన్ని ఇంటికి వెళ్లి కుటుంబసభ్యులకు చరణ్ వివరించాడు. బంధువులు, స్నేహితులు రాత్రంతా కెనాల్ ప్రాంతంలో వెతికినా ప్రయోజనం లేకుండా పోయింది. దీనిపై మహేశ్ అన్న రమేష్ అదే రోజు రాత్రి హనుమకొండ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు.. అన్ని పోలీసుస్టేషన్లకు సమాచారం అందించారు. పోలీసులు సైతం గాలింపు చేపట్టారు.
కాగా, శనివారం ఉదయం నిఖిల్ మృతదేహం మొగిలిచర్ల, మహేశ్ మృతదేహం కొత్తపేట వద్ద ఉన్నట్టు స్థానికులు అక్కడి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి హనుమకొండ పోలీసులు చేరుకుని మృతదేహాలను పంచనామా నిర్వహించారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఎంజీఎంకు తరలించారు. మృతులిద్దరూ అన్న, తమ్ముడి కొడుకులు కావడంతో రెండు కుటుంబాల్లో విషాదం అలుముకుంది. మహేశ్కు నెల రోజుల కిందటే వివాహం జరిగింది. నిఖిల్ పాలెం స్కూల్లో 8వ తరగతి చదువుతున్నాడు.