‘మీనేస్తం’ కాల్‌సెంటర్‌ ప్రారంభం

ABN , First Publish Date - 2020-04-05T10:41:52+05:30 IST

నగరపాలక సంస్థ ప్రజలకు మెరుగైన సేవలందించేందుకు మీనేస్తం పేరుతో ఏర్పాటు చేసిన కాల్‌సెంటర్‌ను

‘మీనేస్తం’ కాల్‌సెంటర్‌ ప్రారంభం

కాల్‌సెంటర్‌ నెంబర్‌ 0878-2200100

ప్రజలకు సేవందించడమే లక్ష్యం 

సద్వినియోగం చేసుకోవాలి : మేయర్‌ వై.సునీల్‌రావు 

24గంటల్లో సమాధానం : కమిషనర్‌ క్రాంతి  


కరీంనగర్‌ టౌన్‌, ఏప్రిల్‌ 4: నగరపాలక సంస్థ ప్రజలకు మెరుగైన సేవలందించేందుకు మీనేస్తం పేరుతో ఏర్పాటు చేసిన కాల్‌సెంటర్‌ను శనివారం నగర మేయర్‌ యాదగిరి సునీల్‌రావు, కమిషనర్‌ వల్లూరి క్రాంతి, డిప్యూటీ మేయర్‌ చల్లస్వరూపరాణిహరిశంకర్‌తోకలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మేయర్‌ మాట్లాడుతూ కార్యాలయ పనివేళల్లో ప్రతిరోజు ఉదయం 10నుంచి సాయంత్రం 5గంటల వరకు నగర ప్రజలు కాల్‌సెంటర్‌ 0878-2200100కు ఫోన్‌చేసి వారి సమస్యలను తెలియజేయాల న్నారు.


సమస్యను స్వీకరించిన కాల్‌సెంటర్‌ ఆపరేటర్‌ ఫిర్యాదును సంబంధిత అధికారులకు ఫార్వర్డ్‌ చేస్తాడన్నారు. తిరిగి వారి నుంచి ఆ ఫిర్యాదుకు ఏ విధమైన చర్య తీసుకున్నారనే విషయాన్ని కూడా సదరు ఫిర్యాదుదారుడికి 24గంటల్లో మెస్సేజీ రూపంలో అందిస్తారని చెప్పారు. దీనితో కార్యాలయానికి రాకుండానే ప్రజలు వారి సమస్యలను పరిష్కరించుకునే వీలుకలుగుతుందని చెప్పారు. ఇళ్ళలోనే ఉండి సానిటేషన్‌, కరోనా వ్యాధికి సంబంధించిన సమస్యలుంటే మీనేస్తంకు ఫిర్యాదు చేయాలని అన్నారు.


వాటిని సంబంధిత అధికారులకు చేరవేసి పరిష్కరిస్తామని చెప్పారు. కమిషనర్‌ వల్లూరి క్రాంతి మాట్లాడుతూ ప్రజలకు జవాబుదారి సేవలందించేందుకు మీనేస్తం కాల్‌సెంటర్‌ను ఏర్పాటు చేశామని అన్నారు. ప్రతిరోజు కాల్‌సెంటర్‌కు వచ్చే ఫిర్యాదులను అడిషనల్‌ కమిషనర్‌ సమీక్షిస్తారని, వారంరోజులకొకసాని నేనే ఫిర్యాదులపై సమీక్ష చేస్తానని అన్నారు. ప్రజలు ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.  కార్యక్రమంలో అదనపు కమిషనర్‌ శ్రీనివాస్‌, ఎస్‌ఈ భద్రయ్య, ఈఈ రామన్‌, ఏఈలు, ఉద్యోగులు పాల్గొన్నారు.

Updated Date - 2020-04-05T10:41:52+05:30 IST