ఏపీ రీసెట్‌ ప్రారంభం

ABN , First Publish Date - 2021-12-08T07:22:49+05:30 IST

రాష్ట్రంలోని యూనివర్సిటీల్లో పీహెచ్‌డీ కోర్సులో ప్రవేశానికి చేపట్టిన ఏపీ రీసెట్‌-2021 మంగళవారం ప్రారంభమైంది.

ఏపీ రీసెట్‌ ప్రారంభం
ప్రశ్నపత్రం కోడ్‌ను విడుదల చేస్తున్న వీసీ రాజారెడ్డి

తిరుపతి (విశ్వవిద్యాలయాలు) డిసెంబరు 7: రాష్ట్రంలోని యూనివర్సిటీల్లో పీహెచ్‌డీ కోర్సులో ప్రవేశానికి చేపట్టిన ఏపీ రీసెట్‌-2021 మంగళవారం ప్రారంభమైంది. ఈ ప్రశ్నపత్రం కోడ్‌ను ఎస్వీయూ వీసీ ప్రొఫెసర్‌ కె.రాజారెడ్డి విడుదల చేశారు. ప్రస్తుతం పీహెచ్‌డీ కోర్సుకు బాగా డిమాండ్‌ పెరిగిందని వీసీ పేర్కొన్నారు. రీసెట్‌కు 12 వేల మందికి పైగా దరఖాస్తు చేసుకోవడమే ఇందుకు నిదర్శనమన్నారు. రీసెట్‌ నిర్వహణలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నామన్నారు. హైదరాబాదుతో పాటు అన్ని జిల్లాల్లో 14 కేంద్రాలు ఏర్పాటు చేశామని ఏపీ రీసెట్‌-2021 కన్వీనర్‌ వి.శ్రీకాంత్‌రెడ్డి తెలిపారు. ఈ నెల 10వ తేదీ దాకా ప్రతి రోజూ రెండు విడతలుగా పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. కరోనా నిబంధనలను అనుసరించి పరీక్షలు చేపడుతున్నామని చెప్పారు. తిరుపతి రూరల్‌ పేరూరు వద్దనున్న ఎస్‌ఎస్‌ డిజిటల్‌ జోన్‌ను ప్రొఫెసర్‌ శ్రీకాంత్‌రెడ్డి పరిశీలించారు. మంగళవారం ఉదయం 10 నుంచి 12 గంటల వరకూ చేపట్టిన 13 సబ్జెక్టులకు సంబంధించిన పరీక్షలకు 2,188 మంది దరఖాస్తు చేసుకోగా, 1679 మంది హాజరయ్యారని తెలిపారు. మధ్యాహ్నం 3 నుంచి 5 గంటల వరకు నిర్వహించిన 10 సబ్జెక్టులకు సంబంధించిన పరీక్షలకు 1853 మంది దరఖాస్తు చేసుకోగా, 1503 మంది హాజరయ్యారని వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్లు పీసీ వేంకటేశ్వర్లు, కుసుమ హరినాథ్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-12-08T07:22:49+05:30 IST