రెండేళ్ల తర్వాత రాష్ట్రంలో మద్య నిషేధం
ABN , First Publish Date - 2020-05-28T10:52:26+05:30 IST
రాష్ట్రంలో మరో రెండేళ్ల తర్వాత పూర్తి స్థాయిలో మద్య నిషేధం అమలు చేస్తామని విద్యుత్, అటవీశాఖ, శాస్త్ర సాంకేతిక శాఖా
- అన్ని జిల్లాల్లో వ్యసన విముక్తి కేంద్రాలు
- మంత్రి బాలినేని
- రిమ్స్లో డ్రగ్ డీ ఎడిక్షన్ సెంటర్ ప్రారంభం
ఒంగోలు నగరం, మే 27: రాష్ట్రంలో మరో రెండేళ్ల తర్వాత పూర్తి స్థాయిలో మద్య నిషేధం అమలు చేస్తామని విద్యుత్, అటవీశాఖ, శాస్త్ర సాంకేతిక శాఖా మాత్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి తెలిపారు. బుధవారం ఒంగోలులోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి(రిమ్స్లో)లో ఆయన డ్రగ్ డీ ఎడిక్షన్ సెంటర్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి బాలినేని మాట్లాడుతూ రాష్ట్రంలో వైసీపీ అధికార పగ్గాలు చేపట్టి ఏడాది పూర్తవుతుందని, నాలుగో ఏడాది పాలన మొదలు కాగానే పూర్తి స్థాయిలో మద్య నిషేధం అమలు చేస్తామని చెప్పారు. అందులో భాగంగా మద్య విక్రయాలను నియంత్రిస్తున్నామన్నారు. మద్యానికి బానిసలై మానసిక స్థితి దెబ్బతిన్న వారి ఆరోగ్యాన్ని మెరుగుపర్చేందుకు ఈ వ్యసన విముక్తి కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నామన్నారు. జీజీహెచ్లో ఉన్న సమస్యలు పరిష్కారానికి, కొత్త విభాగాల ఏర్పాటుకు వైద్యశాఖ మంత్రితో చర్చిస్తామని తెలిపారు. కలెక్టర్ పోలా భాస్కర్ మాట్లాడుతూ డ్రగ్ డీ ఎడిక్షన్ సెంటర్ నిర్వహణ కోసం ప్రభుత్వం రూ.37.27 లక్షలు విడుదల చేసిందన్నారు. ప్రస్తుతం 15 పడకలతో ప్రారంభమైనట్లు వెల్లడించారు. కార్యక్రమంలో రిమ్స్ సూపరింటెండెంట్ శ్రీరాములు, వైద్య కళాశాల ప్రిన్సిపాల్ రాజనమన్నార్, ఆర్ఎంవో వేణుగోపాలరెడ్డి, డిప్యూటీ సూపరింటెండెంట్ మురళికృష్టారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
నాణ్యమైన విద్యను అందించడమే లక్ష్యం
ఒంగోలు(కలెక్టరేట్) : నాణ్యమైన విద్యా ఫలా లు అందరికీ సమానంగా అందించాలనే లక్ష్యంతో విద్యారంగానికి ప్రభుత్వం పెద్ద పీట వేసిందని మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. బుధవారం స్థానిక స్పందనభవన్లో విద్యారంగంపై జరిగిన సదస్సులో ఆయన మాట్లాడారు. ఎమ్మెల్యేలు కె.నాగార్జునరెడ్డి, బుర్రా మదుసూదన్యాదవ్, కలెక్టర్ పోలా భాస్కర్ , జేసీ చేతన్, డీఆర్వో వెంకటసుబ్బయ్య పాల్గొన్నారు.
విద్యా రంగంలో అనేకమార్పులు
రాష్ట్రంలో చిన్నారుల భవిత మార్చేందుకు విద్యావ్యవస్థలో అనేక సంస్కరణలు చేపట్టామని సీఎం జగన్మోహన్రెడ్డి అన్నారు. మనపాలన-మీ సూచన మేథో సదస్సులో భాగంగా బుధవారం విద్యా, దాని అనుబంధ రంగాలపై సీఎం మాట్లాడారు. కార్యక్రమంలో విద్యుత్శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, కలెక్టర్ భాస్కర్, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.