త్యాగధనులకు అండగా నిలవాలి

ABN , First Publish Date - 2020-03-05T08:38:58+05:30 IST

అమరావతి సంపూర్ణ రాజధానిగా అభివృద్ధి చెందటం 2050కి పూర్తి కావచ్చు. 1956 లో కొన్ని గ్రామాల సముదాయంగా ఉన్న హైదరాబాద్ భాగ్యనగరంగా రూపుదిద్దుకోటానికి 58 సంవత్సరాలు...

త్యాగధనులకు అండగా నిలవాలి

అమరావతి సంపూర్ణ రాజధానిగా అభివృద్ధి చెందటం 2050కి పూర్తి కావచ్చు. 1956 లో కొన్ని గ్రామాల సముదాయంగా ఉన్న హైదరాబాద్ భాగ్యనగరంగా రూపుదిద్దుకోటానికి 58 సంవత్సరాలు పట్టలేదా? అమరావతిలో కేవలం 3 ఏళ్ళ(భూసేకరణ జరిగిన తరువాత) కాలంలో సచివాలయ భవనాల సముదాయం, శాసనసభా భవనం, రాష్ట్ర ఉన్నత న్యాయస్థాన భవనాలు నిర్మింపబడి పూర్తిస్థాయిలో  పనిచేస్తూనే ఉన్నాయి.  ముఖ్యంగా దిశానిర్దేశం లేకుండా, ఆర్థిక స్వావలంబనే లేకుండా ఏర్పాటు చేసిన నూతన రాష్ట్ర చరిత్రలో 5 సంవత్సరాలు ఎంత చిన్న సమయమో చెప్పాల్సిన అవసరం లేదు కదా!  కానీ మూడేళ్లలోనే ప్రభుత్వం పూర్తిస్థాయిలో పనిచేయగలిగిన నాలుగు అంగాలు అమరినై అంటే అది అభివృద్ధి కాదా? గవర్నరు నివాసం, న్యాయాధికారుల నివాసాలు, ఎమ్మెల్యేల నివాస సముదాయం,  కార్యదర్శుల, సచివాలయ(గజిటెడ్, నాన్‌–గజిటెడ్, నాల్గవ తరగతి) ఉద్యోగుల నివాసాలు 90 శాతం నిర్మింపబడి ఉంటే అభివృద్ధి జరగలేదంటే ఎవరైనా నమ్ముతారా? రాష్ట్రం నాలుగు మూలలనుండి రాజధానిని కలపటానికి ఉద్దేశితమైన రహదారులు నిర్మాణ దశలో ఉంటే అభివృద్ధిగా భావించలేమా? కొన్ని ప్రతిష్ఠాత్మకమైన విద్యాలయాలు ప్రారంభమై పనిచేయటం గమనించలేమా!. ‘అన్నప్రాసన నాడే ఆవకాయ’ తినాలనుకొనే మూర్ఖ స్థితిలో ప్రజాలుంటారా ఎక్కడైనా?  రాజధాని నిర్మాణ క్రమంలో జరిగిన పనులు అసలు జరగనట్టు అక్కడ స్మశాన నిశబ్దం, ఎడారి వాతావరణం, నీటి ముంపు ఉన్నదన్నట్టు ప్రచారమేమిటి.?.  రాజధాని అంటే పబ్బులు, క్లబ్బులు, భూమాఫియాలు, డాన్లు ఉన్నదే అనుకొంటే ‘నిజమే’ అమరావతి ఆ విధంగా  అనుకున్నంత త్వరగా అభివృద్ధి చెందటం కష్టమే. ‘తలచుకున్నప్పుడే తాత పెళ్ళి’ లాగా జరగాలంటే సాధ్యమా? ఎప్పుడో ఉచితంగా జీవనోపాధికై ఇవ్వబడి  తరతరాలుగా దానిమీదే ఆధారపడి బతుకుతున్న పేదల (అసైన్డ్‌) భూమి ఇప్పుడు ఇళ్ల స్థలాలకోసమని  ప్రభుత్వం లాగేసుకుంటే  ఆవేదనతో కాగిపోతున్న బడుగు రైతులు,   బంగారం పండిస్తున్న పంట పొలాలను రాజధానికోసం ఇచ్చిన రైతులు ఆవేదనతో నిస్సహాయ స్థితిలో 75 రోజులుగా చేస్తున్న ఉద్యమానికి కళ్ళు చెమరుస్తున్నాయి. ఈ తరుణంలో త్యాగధనులైన రైతులకు, సాధారణ ప్రజలకు అందరం అండగా నిలబడకుంటే  దశాబ్దాలు తిరోగమనంలోకి పోయే ప్రమాదముంది. 

పన్నాల సత్యనారాయణ మూర్తి

అధ్యక్షుడు, ఆంధ్ర ప్రయోజన పరిరక్షణ సమితి

Updated Date - 2020-03-05T08:38:58+05:30 IST