స్టెరిలైట్ నుంచి మెడికల్ కాలేజీకి తొలి బ్యాచ్ ఆక్సిజన్
ABN , First Publish Date - 2021-05-13T18:34:42+05:30 IST
వేదాంత కంపెనీ స్టెరిలైట్ కాపర్ స్మెల్టర్ ప్లాంట్లో తయారైన తొలి బ్యాచ్ మెడికల్ గ్రేడ్ ఆక్సిజన్ను గురువారంనాడు..
తూత్తుకుడి: వేదాంత కంపెనీ స్టెరిలైట్ కాపర్ స్మెల్టర్ ప్లాంట్లో తయారైన తొలి బ్యాచ్ మెడికల్ గ్రేడ్ ఆక్సిజన్ను గురువారంనాడు తిరునల్వేలి మెడికల్ కాలేజీ ఆసుపత్రికి డిస్పాచ్ చేశారు. ఆక్సిజన్తో కూడిన ట్యాంకర్కు తూత్తుకుడి జిల్లా కలెక్టర్ కె.సెంథిల్ రాజ్ జెండా ఊపి ప్రారంభించారు. 4.8 టన్నుల మెడికల్ గ్రేడ్ ఆక్సిజన్ను ఉదయం 7 గంటలకు ఎస్కార్ట్ మధ్య మెడికల్ కాలేజీకి పంపినట్టు సెంథిల్ రాజ్ తెలిపారు. గత ఏప్రిల్లో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కాపర్ స్మెల్టర్ ప్లాంట్ తిరిగి తెరిచేందుకు, నాలుగు నెలల పాటు ఆక్సిజన్ యూనిట్లను ఆపరేట్ చేసేందుకు తమిళనాడు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. కాగా, ప్రారంభంలో ప్రతిరోజూ రెండు ఆక్సిజిన్ ట్యాంకర్లను డిస్పాచ్ చేస్తామని, క్రమంగా ఉత్పత్తిని పెంచడం ద్వారా మరిన్ని ఆక్సిజన్ ట్యాంకర్లు సరఫరా చేస్తామని వేదాంత మేనేజిమెంట్ ఒక ప్రకటనలో తెలిపింది. ప్రజల విలువైన ప్రాణాలు కాపాడటం తమకు దక్కిన గౌరవంగా భావిస్తున్నట్టు స్టెరిలైట్ సీఈఓ పంకజ్ కుమార్ తెలిపారు. సంక్షోభ నివారణ, ఆక్సిజన్ నిరంతర సరఫరాకు శక్తివంచన లేకుండా పాటుపడతామని చెప్పారు.