ప్రచారాన్ని ఉధృతం చేయండి!

ABN , First Publish Date - 2021-10-17T08:44:06+05:30 IST

హుజూరాబాద్‌ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ ప్రచారాన్ని ఉధృతం చేయాలని నియోజకవర్గంలోని గ్రామాల ఇన్‌చార్జులకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి సూచించారు.

ప్రచారాన్ని ఉధృతం చేయండి!

  • హుజూరాబాద్‌ ఉప ఎన్నికపై గ్రామాల 
  • కాంగ్రెస్‌ ఇన్‌చార్జులకు రేవంత్‌ దిశానిర్దేశం

హైదరాబాద్‌, అక్టోబరు 16 (ఆంధ్రజ్యోతి): హుజూరాబాద్‌ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ ప్రచారాన్ని ఉధృతం చేయాలని నియోజకవర్గంలోని గ్రామాల ఇన్‌చార్జులకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి సూచించారు. పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ ధరల పెరుగుదలపై బీజేపీ పట్ల, ఉద్యోగ, ఉపాధి కల్పనలో వైఫల్యంతో టీఆర్‌ఎస్‌ పట్ల ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, ఈ అంశాలపై ప్రజల్లో ఆ పార్టీలను నిలదీయాలని అన్నారు. ఉప ఎన్నిక ప్రచారం కోసం ప్రతి గ్రామానికీ కాంగ్రెస్‌  ఇన్‌చార్జులను నియమించిన నేపథ్యంలో శనివారం వారితో జూమ్‌ యాప్‌ ద్వారా రేవంత్‌రెడ్డి, టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మహే్‌షకుమార్‌గౌడ్‌, సీనియర్‌ ఉపాధ్యక్షుడు మల్లు రవి తదితరులు సమావేశమయ్యారు. కాంగ్రెస్‌ అభ్యర్థి బల్మూరి వెంకట్‌ విద్యార్థి ఉద్యమాల్లో చురుకైన పాత్ర పోషించారని, నాలుగుసార్లు జైలుకు కూడా వెళ్లి వచ్చారని రేవంత్‌ గుర్తు చేశారు. ఈ అనుకూలతనూ ప్రజల్లోకి తీసుకెళ్లి మద్దతు కూడగట్టాలని సూచించారు. ఇదిలా ఉండగా.. హుజూరాబాద్‌ ఉప ఎన్నికపై కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్కం ఠాగూర్‌ సోమవారం సమీక్ష నిర్వహించనున్నారు.


హుజూరాబాద్‌లో జరగనున్న ఈ సమావేశంలో.. మండలాల వారీగా నియమించిన సమన్వయకర్తలు పాల్గొననున్నారు. అదేరోజు సాయంత్రం జమ్మికుంటలో జరిగే పార్టీ కార్యక్రమంలో ఠాగూర్‌ పాల్గొంటారు. మంగళవారం చార్మినార్‌ వద్ద జరిగే రాజీవ్‌గాంధీ సద్భావనా దివస్‌ కార్యక్రమానికీ ఆయన హాజరు కానున్నారు. 

Updated Date - 2021-10-17T08:44:06+05:30 IST