కొవిడ్.. హడల్
ABN , First Publish Date - 2021-04-06T06:37:40+05:30 IST
దేశంలో రోజువారీ కొవిడ్ కేసులు లక్ష దాటడం దలాల్ స్ట్రీట్ వర్గాలను హడలెత్తించింది. ఆర్థిక వ్యవస్థ పునరుజ్జీవంపై మళ్లీ నీలినీడలు కమ్ముకుంటుండటంతో అప్రమత్తమైన ట్రేడర్లు షేర్ల అమ్మకాలను పోటెత్తించారు...
- కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు
- ఇంట్రాడేలో 1,450 పాయింట్లు పతనమైన బీఎస్ఈ సెన్సెక్స్
- చివరికి 870 పాయింట్ల నష్టంతో సరి
- రూ.2.16 లక్షల కోట్ల సంపద గల్లంతు
- కరోనా కేసులు లక్ష దాటడమే కారణం
ముంబై: దేశంలో రోజువారీ కొవిడ్ కేసులు లక్ష దాటడం దలాల్ స్ట్రీట్ వర్గాలను హడలెత్తించింది. ఆర్థిక వ్యవస్థ పునరుజ్జీవంపై మళ్లీ నీలినీడలు కమ్ముకుంటుండటంతో అప్రమత్తమైన ట్రేడర్లు షేర్ల అమ్మకాలను పోటెత్తించారు. ఫారెక్స్ మార్కెట్లో రూపాయి విలువ అనూహ్యంగా క్షీణించడమూ ఈక్విటీ ట్రేడిం గ్ సెంటిమెంట్కు గండికొట్టింది. దాంతో స్టాక్ మార్కె ట్ సూచీలు ఒక్కసారిగా కుప్పకూలాయి. సోమవారం ఉదయం 11.15 గంటల సమయంలో బీఎస్ఈ సెన్సెక్స్ ఏకంగా 1,450 పాయింట్ల వరకు పతనమై 48,500 స్థాయికి పడిపోయింది. ఆ తర్వాత సూచీ క్రమంగా కోలుకుంది. చివరికి 870.51 పాయిం ట్ల నష్టంతో 49,159.32 వద్ద స్థిరపడింది. ఎన్ఎ్సఈ నిఫ్టీ సైతం 229.55 పాయింట్ల నష్టంతో 14,637.80 వద్ద ముగిసింది. అమ్మకాల సునామీలో రూ.2.16 లక్షల కోట్ల స్టాక్ మార్కెట్ సంపద గల్లంతైంది. దాంతో బీఎ్సఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.205.09 లక్షల కోట్లకు పడిపోయింది.
సెన్సెక్స్లోని 30 లిస్టెడ్ కంపెనీల్లో 25 నష్టాల్లోనే ముగిశాయి. బజాజ్ ఫైనాన్స్ 5.81 శాతం పతనమై సూచీ టాప్ లూజర్గా నిలిచింది. ఇండ్సఇండ్ బ్యాంక్ 5.64 శాతం క్షీణించగా.. ఎస్బీఐ 4.56 శాతం, ఎం అండ్ ఎం 4.17 శాతం తగ్గాయి. కాగా హెచ్సీఎల్ టెక్నాలజీస్ 3.08 శాతం పెరిగి సెన్సెక్స్ టాప్ గెయినర్గా నిలిచింది.
రూపాయీ లాస్!
అంతర్జాతీయంగా డాలర్ బలపడటంతో పాటు దేశీయంగా కరోనా కేసుల కలవరం రూపాయి విలువకు గండికొట్టింది. డాలర్తో రూపాయి మారకం రేటు 18 పైసలు బలహీనపడి 73.30 స్థాయికి చేరుకుంది.
స్టాక్ మార్కెట్లో స్పూఫింగ్కు చెక్
సెబీ కొత్త నిబంధనలు అమల్లోకి..
స్టాక్ మార్కెట్ ట్రేడింగ్లో స్పూఫింగ్కు చెక్ పెట్టేందుకు క్యాపిటల్ మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ కొత్త నిబంధనలు సోమవారం నుంచి అమల్లోకి వచ్చాయి. తరచుగా స్పూఫింగ్కు పాల్పడే వారి ట్రేడింగ్ ఖాతాను 15 నిమిషాల నుంచి 2 గంటల వరకు నిలిపివేయనున్నారు. పెద్ద మొత్తం లేదా భారీ సంఖ్యలో షేర్ల కొనుగోలు లేదా అమ్మకం ఆర్డర్ పెట్టి, ఎగ్జిక్యూట్ కాకముందే ఆ ఆర్డర్ను ఉద్దేశపూర్వకంగా రద్దు చేసుకోవడాన్ని స్పూఫింగ్ అంటారు. ఉద్దేశపూర్వక ఆర్డర్ల రద్దు ఆ షేర్ల ధరపై ప్రతికూల ప్రభావం చూపుతుందని మార్కెట్ నిపుణులు అంటున్నారు.