స్టాక్ ట్యాంక్లోకి దిగి కార్మికుడి మృతి
ABN , First Publish Date - 2022-01-24T07:02:37+05:30 IST
పెద్దాపురం మండ లం వాలుతిమ్మాపురం లో సైరస్ ఓవర్సీస్ ప్రైవేట్ లిమిటెడ్ పరిశ్రమలో ప్రమాదవశాత్తూ కార్మికుడు మృతి చెందడంతో మృతదేహంతో బంధువులు ఆదివారం ఫ్యాక్టరీ ఎదుట ఆందోళనకు దిగారు.
- న్యాయం చేయాలని మృతదేహంతో ఆందోళన. వాలుతిమ్మాపురంలో ఘటన
- నష్టపరిహారాన్ని చెల్లించేందుకు అంగీకరించిన ఫ్యాక్టరీ యాజమాన్యం
పెద్దాపురం, జనవరి 23: పెద్దాపురం మండ లం వాలుతిమ్మాపురం లో సైరస్ ఓవర్సీస్ ప్రైవేట్ లిమిటెడ్ పరిశ్రమలో ప్రమాదవశాత్తూ కార్మికుడు మృతి చెందడంతో మృతదేహంతో బంధువులు ఆదివారం ఫ్యాక్టరీ ఎదుట ఆందోళనకు దిగారు. స్థానిక జి.రాగంపేట గ్రామానికి రాచపల్లి ఫృథ్వీరాజ్ ఆపరేటర్గా పనిచేస్తున్నా డు. శనివారంరాత్రి నైట్ షిఫ్ట్ డ్యూటీలో ఉండగా ఫ్యాక్టరీలో స్టాక్ ట్యాంక్లోకి దిగడంతో ఊపిరి ఆడక చనిపోయాడు. అతడి సహచర ఉద్యోగి కాపాడే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. దీంతో ప్రజాసంఘాలు, గ్రామస్థులు, మృతుడి బంధువులు ఆదివారం ఫ్యాక్టరీ వద్దకు చేరుకుని మృతదేహంతో ఆందోళన చేపట్టారు. తమకు న్యాయం చేయాలంటూ ఫ్యాక్టరీలోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. కేవలం ఫ్యాక్టరీ యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగానే ఫృథ్వీరాజ్ మృతిచెందాడని బంధువులు ఆరోపించారు. ఉద్రిక్త పరిస్థితి నెలకొనడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. ఫ్యాక్టరీ యాజమాన్యం స్పందించి నష్టపరిహారాన్ని చెల్లించేందుకు అంగీకరించడంతో ఆందోళనను విరమించారు.