దుకాణాలను వంతుల వారీగా తెరవాలి

ABN , First Publish Date - 2020-05-07T09:59:37+05:30 IST

మున్సిపాలిటీల పరిధిలో రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన సడలింపుల ప్రకారం ఏబీసీ కేటగిరిలుగా విభజించి

దుకాణాలను వంతుల వారీగా తెరవాలి

కలెక్టర్‌ శశాంక


కరీంనగర్‌, మే 6 (ఆంధ్రజ్యోతి, ప్రతినిధి): మున్సిపాలిటీల పరిధిలో రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన సడలింపుల ప్రకారం  ఏబీసీ కేటగిరిలుగా విభజించి దుకాణాలు తెరుచుకునేందుకు అనుమతివ్వాలని కలెక్టర్‌ కె శశాంక అన్నారు. బుధవారం ఆయన వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇప్పటికే అనుమతించిన దుకాణలు ‘ఎ’ కేటగిరీలోకి వస్తాయని, వీటిని యథావిధిగా నిర్వహించుకోవచ్చన్నారు.


‘బి’ కేటగిరిలోని దుకాణాలకు ప్రతి రోజు 50 శాతం మాత్రమే తెరిచేందుకు అనుమతివ్వాలన్నారు. అందుకు అనుగుణంగా డివిజన్ల వారీగా షాపులను గుర్తించి వాటికి నంబర్లు వేయాలన్నారు. ఈ నంబరింగ్‌ ప్రకారం ఏ దుకాణం ఏ రోజు తెరిచి ఉంచాలనేది నిర్ణయించాలన్నారు. నంబర్లు వేసే సమయంలో ‘ఎ’ కేటగిరీ దుకాణాలను గుర్తించి వాటికి నంబర్లు వేయొద్దన్నారు. నంబర్లు వేసిన అనంతరం వరక్త సంఘాల ప్రతినిధులకు పూర్తి విషయాలు వివరించాలన్నారు. కేటాయించిన ననంబర్లప్రకారం రోజు విడిచి రోజు షాపులు తెరుచుకోవాలని సూచించాలని తెలిపారు. సీ కేటగిరీలోని వ్యాపార సంస్థలను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించవద్దన్నారు.


65 సంవత్సరాలు పైబడిన వృద్దులు, గర్భిణులు, 10 సంవత్సరాలలోపు పిల్లలను వైద్యపరమైన సమస్యలకు తప్ప ఇండ్ల నుంచి బయటకు రాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం సీపీ వీబీ కమలాసన్‌రెడ్డి మాట్లాడుతూ డివిజన్ల వారీగా నంబరింగ్‌ చేసే షాపుల వివరాలు అందించాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్‌ శ్యాంప్రసాద్‌లాల్‌, మున్సిపల్‌ కమిషనర్‌ వల్లూరి క్రాంతి, డీసీపీ అశోక్‌, కరీంనగర్‌, హుజురాబాద్‌ ఆర్డీవోలు, మున్సిపల్‌ కమిషనర్లు పాల్గొన్నారు.

Updated Date - 2020-05-07T09:59:37+05:30 IST