లాక్‌డౌన్ సమయంలో విదేశాల్లో చిక్కుకున్న వారిని తీసుకురాలేం: విదేశాంగ మంత్రి

ABN , First Publish Date - 2020-04-06T16:46:39+05:30 IST

భారత్‌లో ప్రస్తుతం లాక్‌డౌన్ కొనసాగుతోందని.. ఈ సమయంలో విదేశాల నుంచి భారతీయులను తీసుకురాలేమని విదేశాంగ మంత్రి వి. మురళీధరణ్ స్పష్టం చేశారు.

లాక్‌డౌన్ సమయంలో విదేశాల్లో చిక్కుకున్న వారిని తీసుకురాలేం: విదేశాంగ మంత్రి

తిరువనంతపురం: భారత్‌లో ప్రస్తుతం లాక్‌డౌన్ కొనసాగుతోందని.. ఈ సమయంలో విదేశాల నుంచి భారతీయులను తీసుకురాలేమని విదేశాంగ మంత్రి వి. మురళీధరణ్ స్పష్టం చేశారు. విదేశాల్లో చిక్కుకున్న భారతీయులు తమను స్వదేశానికి తీసుకురమ్మంటూ కేంద్రానికి అనేక అభ్యర్థనలు చేస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం భారత ప్రభుత్వం విదేశాల నుంచి వచ్చే విమానాలను నిలిపివేసిన అంశాన్ని ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలన్నారు. ఒకవేళ విదేశాల్లో భారతీయులకు ఇబ్బందులు తలెత్తితే.. కేంద్రం ఏర్పాటుచేసిన సహాయ కేంద్రాలను సంప్రదించాలన్నారు. విదేశాల్లో చిక్కుకున్న భారతీయులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా కేంద్రం చర్యలు తీసుకుంటూ వస్తోందన్నారు. 


కాగా.. ఇటీవల యూఏఈలో స్థిరపడ్డ అఫీ అహ్మద్ అనే భారతీయుడు మస్కట్ నుంచి భారత్‌కు తొమ్మిది చార్టర్డ్ విమానాలను ఏర్పాటుచేశాడు. ఈ విమానాలు భారత్ చేరేందుకు అనుమతివ్వాలని విదేశాంగ శాఖకు చెందిన అధికారులను, దౌత్యవేత్తలను తాను కోరానని, అయినప్పటికి ఏ ఒక్కరు అనుమతి ఇవ్వలేదని ఆయన చెప్పుకొచ్చాడు. గల్ఫ్ దేశాలు చార్టర్డ్ విమానాలకు అనుమతిస్తున్నా.. భారత ప్రభుత్వం నిరాకరిస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ విషయంపై కూడా మురళీధరణ్ స్పందించారు. చార్టర్డ్ విమానాల్లో వచ్చే వారికి ప్రత్యేకంగా అనుమతి ఇవ్వలేమని.. దీని నుంచి ఎవరూ మినహాయింపు కాదని స్పష్టం చేశారు. కేరళకు చెందిన సినిమా డైరెక్టర్ బ్లెస్సీ, నటుడు పృథ్వీరాజ్ కూడా జోర్డన్‌లో చిక్కుకున్నట్టు గుర్తుచేశారు. సినిమా షూటింగ్‌కు వెళ్లి చిక్కుకున్న వారిని కూడా ప్రభుత్వం అనుమతించలేదని గుర్తుపెట్టుకోవాలన్నారు. విదేశాల్లో చిక్కుకున్న భారతీయులకు ఇబ్బందులు తలెత్తితే +91112302113, +911123014104, +911123017905 and 1800128797 (టోల్‌ఫ్రీ నెంబర్) హెల్ప్‌లైన్ నెంబర్లను సంప్రదించాలని కోరారు.

Updated Date - 2020-04-06T16:46:39+05:30 IST