సీపీఐని బలోపేతం చేస్తాం
ABN , First Publish Date - 2020-09-27T12:34:49+05:30 IST
మంచిర్యాల జిల్లాలో పార్టీని బలోపేతం చేసేందుకు సమగ్ర ప్రణాళికతో ముందకు వెళ్తున్నామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు...
బెల్లంపల్లి టౌన్, సెప్టెంబరు 26: మంచిర్యాల జిల్లాలో పార్టీని బలోపేతం చేసేందుకు సమగ్ర ప్రణాళికతో ముందకు వెళ్తున్నామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే గుండా మల్లేష్ తెలిపారు. శనివారం పట్టణంలోని తమ నివాసంలో ఏర్పాటు చేసిన సీపీఐ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సమా వేశానికి జిల్లా కార్యదర్శి కలవేణ శంకర్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా గుండా మల్లేష్ మాట్లాడారు. సీపీఐ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై అనేక పోరాటాలు చేసి చెరగని ముద్ర వేసుకుందని చెప్పారు. నేటి పాలకుల విధానాలను ఎండగట్టడమే పార్టీ ధ్యేయం అన్నారు. జిల్లాలోని బెల్లంపల్లి, మంచిర్యాల, లక్షెట్టిపేట, మందమర్రి, నస్పూర్, క్యాతన్పల్లి మున్సిపాలిటీలలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అధ్యాయనం చేస్తామని చెప్పారు. మున్సిపాలిటీలలో పర్యటించి సమస్యలపై పోరాటాలు నిర్వహించాలని పార్టీ యోచిస్తున్నట్లు ఆయన తెలిపారు. బెల్లంపల్లిలో మెడికల్ కళాశాల సాధన, ఆర్టీసీ బస్ డిపో, ఇళ్ల స్థలాల పట్టాలు, డబుల్ బెడ్ రూం ఇళ్ల, మిషన్ భగీరథ నీరు, కొత్త బొగ్గు గనుల ఏర్పాటు తదితర సమస్యలపై ప్రభుత్వంతో పోరాడేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. సమావేశంలో పార్టీ పట్టణ కార్యదర్శి గుండా చంద్రమాణిక్యం, నాయకులు ఆడెపు రాజమౌళి, రత్నం రాజం, అక్కేపల్లి బాప, తదితరులు పాల్గొన్నారు.