గంజాయి సాగు చేస్తే కఠిన చర్యలు

ABN , First Publish Date - 2021-10-22T05:09:15+05:30 IST

గంజాయి సాగు చేస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ సింధు శర్మ హెచ్చరించారు.

గంజాయి సాగు చేస్తే కఠిన చర్యలు
మాట్లాడుతున్న ఎస్పీ సింధుశర్మ

- తల్లిదండ్రులు పిల్లల ప్రవర్తనపై నిఘా ఉంచాలి

- ఎస్పీ సింధు శర్మ

జగిత్యాల టౌన్‌, అక్టోబరు 21: గంజాయి సాగు చేస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ సింధు శర్మ హెచ్చరించారు. జిల్లా కేంద్రంలోని పోలీస్‌ ప్రధాన కార్యాలయంలో సీఎం కేసీఆర్‌, డీజీపీ మహేందర్‌ రెడ్డి సూచనల మేరకు ఎస్పీ సింధు శర్మ ఆధ్వర్యలో గంజాయి రవాణా, విక్రయాలపై జిల్లా పోలీస్‌ అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి మాట్లాడారు. వివధ రాష్ట్రాల సరిహద్దులు నుంచి వచ్చే గంజాయి, గుట్కా సరఫరా చేసే మూలాలను, కీలక వ్యక్తులను గుర్తుంచి వారిపై కేసులు నమోదు చేసి అక్రమ రవాణాను పకడ్బందీగా నియంత్రించాలన్నారు. ప్రతీ పోలీస్‌ అధికారి తమ పరిధిలో గంజాయిసాగు, అక్రమ రవాణాపై ప్రత్యేక నిఘా పెట్టాలన్నారు. గంజాయి అరికట్టేందుకు ఎక్సైజ్‌ శాఖ, అటవీ శాఖ, గ్రామాల సర్పంచులతో సమన్వయం చేసుకోవాలన్నారు. మారుమూల ప్రాంతాల్లో కొందరు వ్యక్తులు మిర్చి, పత్తి సాగుతో పాటు గంజాయిని సాగుచేసే అవకాశం ఉందని అటువంటి ప్రాంతాలపై ప్రత్యేక నిఘా ఉంచాలన్నారు. నిర్మానుష్య ప్రదేశాలు, పాడుబడ్డ భవనాల్లో యువత ఎక్కువగా గంజాయి సేవించే అవకాశాలు ఉన్నాయని అలాంటి ప్రాంతాలపై తరుచుగా నిఘా ఉంచాలన్నారు. గంజాయి సేవించే వారు సోషల్‌ మీడియా వేదికగా ప్రత్యేక గ్రూపులు ఏర్పాటు చేసుకుంటున్నారన్నారు. గంజాయి సేవించే వారి వివరాలు సేకరించి వారి తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సెలింగ్‌ నిర్వహించాలన్నారు. జగిత్యాలను గంజాయి రహిత జిల్లాగా మార్చేలా పోలీస్‌ అధికారులు అంకితభావంతో పనిచేయాలన్నారు. కార్యక్రమంలో అడ్మిన్‌ ఎస్పీ సురేష్‌ కుమార్‌, డీఎస్పీలు ప్రకాష్‌, రవీందర్‌రెడ్డి, ఎస్బీ ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాస్‌, సీసీఎస్‌ ఇన్‌స్పెక్టర్‌ ఆరీఫ్‌ అలీఖాన్‌, ఐటీ కోర్‌  ఇన్‌స్పెక్టర్‌ సరీలాల్‌, సీఐలు రాజశేఖర్‌ రాజు, కిషోర్‌, కృష్ణ కుమార్‌, కోఠేశ్వర్‌, రమణమూర్తి, శ్రీను,  ఎస్సైలు, సిబ్బంది తదితరులు ఉన్నారు. 


Updated Date - 2021-10-22T05:09:15+05:30 IST