రైతులను మోసం చేస్తే కఠిన చర్యలు
ABN , First Publish Date - 2021-05-11T06:14:43+05:30 IST
రైతులను మోసం చేస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ రాహుల్ హెగ్డే అన్నారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో పోలీస్, తూనికలు కొలతలు, వ్యవసాయశాఖ, సివిల్ సప్లయీస్ అధికారులతో ధాన్యం కొనుగోళ్లపై నిర్వహించిన సమీక్షలో మాట్లాడారు.
సిరిసిల్ల క్రైం, మే 10: రైతులను మోసం చేస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ రాహుల్ హెగ్డే అన్నారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో పోలీస్, తూనికలు కొలతలు, వ్యవసాయశాఖ, సివిల్ సప్లయీస్ అధికారులతో ధాన్యం కొనుగోళ్లపై నిర్వహించిన సమీక్షలో మాట్లాడారు. తూకంలో మోసాలకు పాల్పడితే కేసులు నమోదు చేస్తామన్నారు. రైస్ మిల్లులు, కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేయడానికి సంబంధిత అధికారులతో రెండు టాస్క్ ఫోర్స్ బృందాలు ఏర్పాటు చేశామన్నారు. ఈ బృందాలు సిరిసిల్ల, వేములవాడ సబ్ డివిజన్లలో క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహిస్తాయన్నారు. తేమ శాతం, తాలు, తప్ప పేరిట క్వింటాల్కు నాలుగు కిలోల తరుగు తీసుకోవడంపై రైతుల నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు వచ్చాయన్నారు. రైతులు తీసుకొచ్చిన ధాన్యం నాణ్యత లేకపోతే సంబంధిత వ్యవసాయ శాఖ అధికారులు పరిశీలించిన తర్వాత ధర చెల్లించాలన్నారు. అలా కాకుండా రైతులు తెచ్చిన ఽధాన్యానికి ధర తగ్గిస్తే కేసులు నమోదు చేస్తామని, రైస్ మిల్లులను సీజ్ చేస్తామని తెలిపారు. కొనుగోలు కేంద్రాల్లో ఎవరైనా మోసానికి పాల్పడితే డయల్ 100 లేదా 6303922572, 79011 24613కి వాట్సప్, ఎస్ఎంఎస్ లేదా సమాచారం ఇవ్వాలని, వెంటనే చర్యలు తీసుకుంటామని అన్నారు. రైతాంగానికి పోలీస్శాఖ, అధికార యంత్రాంగం అండగా నిలుస్తాయన్నారు. ఇందుకోసం డీఎస్పీ రవికుమార్ను ఇన్చార్జి అధికారిగా నియమించామన్నారు. డీఆర్డీవో కౌటిల్య, డీఏవో రణధీర్రెడ్డి, సిరిసిల్ల డీఎస్పీ చంద్రశేఖర్, రవికుమార్, స్పెషల్ బ్రాంచి సీఐ సర్వర్, లీగల్మెట్రాలజీ అధికారి రవీందర్, డీసీవో బుద్ధనాయుడు, సివిల్ సప్లయీస్ అధికారి జితేందర్రెడ్డి పాల్గొన్నారు.