నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠన చర్యలు

ABN , First Publish Date - 2021-11-30T06:00:08+05:30 IST

విధుల పట్ల నిర్లక్ష్యంగా ఉన్న గ్రామ సచివాలయ సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటానని కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ హెచ్చరించారు.

నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠన చర్యలు
మాట్లాడుతున్న కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌

 కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ హెచ్చరిక

చినగంజాం, నవంబరు 29 : విధుల పట్ల నిర్లక్ష్యంగా ఉన్న గ్రామ సచివాలయ సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటానని కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ హెచ్చరించారు. పెదగంజాం గ్రామ పంచాయతీ పరిధిలోని పల్లెపాలెం సచివాలయాన్ని సోమవారం ఆయన తనిఖీ చేశారు.  సిబ్బందికి వంద శాతం హాజరు ఉండాలని, వలంటీర్ల కూడా వారానికి 3 సార్లు తప్పనిసరిగా హాజరు నమోదు చేసుకోవాలని కలెక్టరు సూచించారు. గ్రామ సచివాలయ పరిధిలో ఓటీఎస్‌ సర్వే 37.8 శాతం మాత్రమే పూర్తి చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పల్లెపాలెంలో శిథిలావస్థలో ఉన్న తుఫాన్‌ పునరావాస కేంద్రాన్ని కలెక్టర్‌ పరిశీలించారు. ప్రజలకు ఇబ్బందికరంగా ఉన్న ఆ కేంద్రాన్ని కూల్చివేయడానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సిటిజన్‌ ఔట్‌రీచ్‌ కార్యక్రమంలో ఆయన పాల్గొని సచివాలయ సిబ్బందికి సూచనలిచ్చారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్‌ నక్కల కృష్ణ, తహసీల్దార్‌ యు.శ్రీనివాసరావు, ఈవోఆర్డీ కె.స్వరూపరాణి, ఏపీఎం వి.లాజర్‌, గృహ నిర్మాణ శాఖ ఏఈ రాజశేఖర్‌, ఆర్‌ఐ ప్రహర్ష, గ్రామ కార్యదర్శులు, వీఆర్వోలు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

ప్రభుత్వ భవనాలకు స్థలాలు గుర్తించాలి

ఒంగోలు(కలెక్టరేట్‌), నవంబరు 29: ఉపాధి హామీపథకం నిధులతో చేపట్టిన ప్రభుత్వ భవనాలకు స్థలాలు గుర్తించాలని కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్‌ నుంచి సోమవారం సాయంత్రం మండల స్థాయి అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. కోర్టు అభ్యంతరాలు, సమస్యలపై నిలిచిన భవనాలకు ప్రత్యామ్నాయంగా స్థలాలు గుర్తించి ఇంజనీర్లకు చూపాలన్నారు. ప్రైవేటు స్థలాలు ఇచ్చేవారికి అంతే విలువైన భూమిని మరోచోట కేటాయించేందుకు ప్రభుత్వం అనుమతించిందని చెప్పారు. ఆ మేరకు స్థలాల గుర్తింపు వేగంగా చేపట్టాలన్నారు .చెత్త నుంచి సంపద సృష్టించే కేంద్రాలకు ఒంగోలు డివిజన్‌లో 75 ప్రాంతాల్లో స్థలాల కొరత ఉందన్నారు. ప్రభుత్వ గిరిజన రెసిడెన్షియల్‌ పాఠశాలల నిర్మాణానికి చీరాల, పర్చూరు, ఉలవపాడు, మార్కాపురం మండలాల్లో పది ఎకరాల చొప్పున స్థలాలు కేటాయించాల న్నారు. స్పందన ఆర్జీలుపెండింగ్‌లో ఉండటంపై మండలస్థాయి అధికారులపై కలెక్టర్‌ అసంతృప్తి వ్యక్తంచేశారు.  జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకంరుణాలు తిరిగిచెల్లింపులు వేగంగా జరగాలన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో జాయిట్‌ కలెక్టర్లు జె.వెంకట మురళి, టీఎస్‌ చేతన్‌, కేఎస్‌ విశ్వనాధన్‌, వివిధ శాఖల అధికారులు జాలిరెడ్డి, శీనారెడ్డి, కొండయ్య, జీవీ నారాయణరెడ్డి, సురేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-11-30T06:00:08+05:30 IST